న్యూఢిల్లీ: నిర్భయ కేసులో ఉరిశిక్ష పడిన నలుగురు దోషుల్లో ఒకడైన వినయ్ శర్మ గురువారం సుప్రీంకోర్టులో క్యురేటివ్ పిటిషన్ దాఖలు చేశాడు. నిర్భయ దోషులకు డెత్ వారెంట్ జారీ చేస్తూ రెండు రోజుల క్రితం ఢిల్లీలోని పటియాలా కోర్టు సంచలన తీర్పు వెల్లడించిన సంగతి తెలిసిందే. ఈ నెల 22న ఉదయం 7 గంటలకు తిహార్ జైల్లో నలుగురు దోషులను ఉరి తీయాలని న్యాయస్థానం ఆదేశించింది. ఆలోగా దోషులు తమకున్న న్యాయపరమైన అవకాశాలను వినియోగించుకోవచ్చని సూచించింది. ఈ నేపథ్యంలో వినయ్ శర్మ క్యురేటివ్ పిటిషన్ దాఖలు చేశాడు.
మరోవైపు ఉరిశిక్షపై దోషులు దాఖలు చేసిన రివ్యూ పిటిషన్లను ఇప్పటికే సుప్రీంకోర్టు కొట్టివేసిన సంగతి తెలిసిందే. దోషులకు మిగిలింది చివరి న్యాయమార్గం క్యురేటివ్ పిటిషన్ మాత్రమే. దీనిపై న్యాయమూర్తుల ఛాంబర్ లో నిర్ణయం తీసుకోనున్నారు.
దేశ రాజధాని ఢిల్లీలో 2012 డిసెంబర్ 16న నిర్భయపై సామూహిక లైంగిక దాడి జరిగిన సంగతి తెలిసిందే. కదులుతున్న బస్సులో ఆరుగురు గ్యాంగ్ రేప్ కు పాల్పడ్డారు. ఆతర్వాత బాధితురాల్ని నడిరోడ్డుపై పడేశారు. దీంతో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ 13రోజుల పాటు పోరాడిన నిర్భయ చివరకు ప్రాణాలు విడిచింది. ఈ కేసుకు సంబంధించి ఓ మైనర్ (17) సహా ఆరుగురు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. కేసు విచారణలో ఉండగానే ప్రధాన నిందితుడైన రామ్సింగ్ 2013 మార్చి 11న తీహార్ జైలులో ఆత్మహత్య చేసుకున్నాడు. మైనర్ (17)కు జువెనైల్ జస్టిస్ బోర్డు మూడేండ్ల శిక్ష విధించి బాలనేరస్థుల పాఠశాలకు తరలించింది. అతడు 2015 డిసెంబర్ 20న విడుదలయ్యాడు. మిగతా నలుగురు.. ముకేశ్, వినయ్ శర్మ, పవన్, అక్షయ్ కుమార్ సింగ్ లను దోషులుగా నిర్ధారిస్తూ ఢిల్లీ హైకోర్టు విధించిన ఉరిశిక్షను ఖరారు చేసింది.
ఈ తీర్పు సవాల్ చేస్తూ దోషి అక్షయ్ సింగ్ సుప్రీం కోర్టును ఆశ్రయించాడు. అయితే, రివ్యూ పిటిషన్ ను గతేడాది డిసెంబర్ 18న సుప్రీం కోర్టు కొట్టేసింది. నలుగురు దోషులను ఉరి తీయాల్సిందేనని స్పష్టం చేసింది. ఇప్పటికే అన్ని విచారణలు పూర్తయినందున తీర్పును మరోసారి పరిశీలించాల్సిన అవసరం లేదని ధర్మాసం అభిప్రాయపడింది. రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ కూడా దోషులు పెట్టుకున్న క్షమాబిక్ష పిటిషన్ను తిరస్కరించారు. అయితే, నిర్భయ దోషులకు శిక్ష అమలులో జాప్యంపై ఆమె తల్లిదండ్రులు కోర్టుకు వెళ్లగా.. జనవరి 7న న్యాయస్థానం ఉరి శిక్ష తేదీలను ఖరారు చేస్తూ తీర్పు వెలువరించింది. నలుగురు నిర్భయ దోషులను జనవరి 22న ఉరి తీయాలని ఢిల్లీ కోర్టు ఆదేశించింది. ఈ తీర్పును నిర్భయ తల్లి స్వాగతించారు. ఉరి శిక్షపై క్యూరేటివ్ పిటిషన్ దాఖలు చేయడం కోసం దోషులైన ముకేశ్ (30), పవన్ గుప్తా (23), వినయ్ శర్మ (34), అక్షయ్ ఠాకూర్ (31)లకు కోర్టు 14 రోజలు గడువు ఇచ్చింది.