(న్యూస్ ఆర్బిట్ డెస్క్)
జాతిని ఏకీకృతం చేయాలంటే హిందీని అందరూ దేశభాషగా స్వీకరించాలన్న కేంద్ర హోంమంత్రి అమిత్ షా మాటలకు హిందీయేతర రాష్ట్రాలలో వ్యక్తమైన వ్యతిరేకత రెండవ రోజు మరింత బలపడింది. కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ ఒక ఫేస్ బుక్ పోస్టులో అమిత్షా మాటలను చీల్చి చెండాడారు. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ అయితే అమిత్షా మాట్లాడిన రోజునే ఆయన ప్రకటనను తీవ్రంగా ఖండించారు. తమిళనాడులో డిఎంకె అధినేత స్టాలిన్ ‘ఇది ఇండియా హిందియా కాదు’ అని వ్యాఖ్యానించారు. కర్నాటకలో బిజెపి అధికారంలో ఉంది కాబట్టి ప్రభుత్వం వైపు నుండి ఎవరూ నోరు మెదపలేదు. అయితే కన్నడిగులు భాష విషయంలో ఎంత పట్టుదలగా ఉంటారో అందరికీ తెలుసు.
ఈ వాతావరణంలో కొట్టొచ్చినట్లు కనబడుతున్నది రెండు తెలుగు రాష్ట్రాల మౌనం. ఆంధ్రప్రదేశ్లో రాజ్యమేలుతున్న వైసిపి ప్రభుత్వాధినేత వైఎస్ జగన్మోహనరెడ్డి కానీ, ప్రతిపక్ష నేత నారా చంద్రబాబు నాయుడు కానీ అమిత్ షా మాటలపై నోరు మెదపలేదు. అంతే కాదు తమ పార్టీ నుండి ఎవరితోనూ మాట్లాడించలేదు కూడా.
ప్రత్యేక తెలంగాణ ఉద్యమానికి భాష అస్తిత్వాన్ని కూడా ఊతంగా వాడుకున్న టిఆర్ఎస్ అధినేత, ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు అమిత్షా మాటలకు స్పందించలేదు. ఆ పార్టీ నేతలు ఎవరూ కూడా నోరు మెదపలేదు.
రెండు తెలుగు రాష్ట్రాలలోనూ ప్రభుత్వాలు ప్రతిపక్షాల నుండి తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్నాయి. ఆంధ్రప్రదేశ్లో వంద రోజుల క్రితం అధికారంలోకి వచ్చిన వైఎస్ జగన్మోహనరెడ్డి ప్రభుత్వం వివిధ నిర్ణయాల కారణంగా ప్రధాన ప్రతిపక్షమైన టిడిపి నుండి సవాళ్లను ఎదుర్కొంటున్నది. ముందస్తు ఎన్నికలకు వెళ్లి రెండవ సారి అధికారం సంపాదించుకున్న టిఆర్ఎస్ కూడా కాంగ్రెస్, బిజెపి నుండి సవాళ్లను ఎదుర్కొంటున్నది. ఈ సవాళ్లను ఎదుర్కొనే క్రమంలో రాజకీయ ఎత్తుగడలతో తీరికలేని అధికార పక్షాలు అమిత్షా మాటాలను ఉపేక్షిస్తున్నాయని అనుకోవాల్సి వస్తున్నది.
దక్షిణాదిన తీవ్రమైన హిందీ వ్యతిరేకత ఉన్న విషయాన్ని రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు మరిచిపోతున్నారు. 1960 దశకం ఆఖరులో ఆంధ్రప్రదేశ్లో కూడా హిందీ వ్యతిరేక ఉద్యమం నడిచిన విషయం తెలుగు రాష్ట్రాలలోని రాజకీయ పక్షాల నేతలు మరిచిపోయినట్లున్నారు.
అటు తెలంగాణలోనూ, ఇటు ఆంధ్రప్రదేశ్లోనూ ప్రాంతీయ పార్టీలు అధికారంలో ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్లో ప్రధాన ప్రతిపక్షం కూడా ప్రాంతీయ పార్టీనే. ప్రాంతీయ పార్టీల అస్తిత్వాలు, భాష, సంస్కృతి పునాదులుగా మనుగడ సాగిస్తాయి. అలాంటిది ఈ పార్టీలు హిందీయేతర రాష్ట్రాలపై హింది భాషను రుద్దే ప్రయత్నాల పట్ల నోరు మెదపకుండా ఉండటం ఆశ్చర్యం కలిగిస్తోంది.