అభ్యర్థులందరివీ నా ముఖాలే
ఎంఎన్ఎం అధ్యక్షుడు కమల్
చెన్నై: రాబోయే లోక్సభ ఎన్నికలలో తాను పోటీ చేయడం లేదని నటుడు, ఎంఎన్ఎం అధ్యక్షుడు కమల్ హాసన్ తెలిపారు. మక్కల్ నీది మయ్యం పార్టీ మేనిఫెస్టో, అభ్యర్థుల రెండోజాబితాను ఆయన విడుదల చేశారు. ఈ సందర్భంగా కమల్ మాట్లాడుతూ, అభ్యర్థులందరివీ తన ముఖాలేనని, తాను రథం ఎక్కడం కంటే రథం లాగడాన్నే గర్వంగా భావిస్తానని చెప్పారు. ఉద్యోగాలు, సమాన వేతనాలు, మహిళలకు రిజర్వేషన్ తదితర హామీలతో పాటు రైతులకు నూరుశాతం లాభం వచ్చేలా చూస్తానంటూ కమల్ భారీగా హామీలు ఇచ్చారు.
ఉద్యోగాలు.. డోర్ డెలివరీ
50 లక్షల ఉద్యోగాలు కల్పిస్తానని, అలాగే మహిళలకు వాటిలో 50 శాతం రిజర్వేషన్ కల్పిస్తానని అన్నారు. మహిళలకు కూడా పురుషులతో సమానవేతనం ఇస్తామని చెప్పారు. రాష్ట్ర గవర్నర్లను శాసన సభ్యులే ఎన్నుకునేలా చేస్తానన్నది కూడా కమల్ ఇచ్చిన హామీలలో ఒకటి. అందరికీ ఉచితంగా వై-ఫై, జాతీయ రహదారుల మీద టోల్ గేట్ ఎత్తివేత, పౌరసరఫరాల వ్యవస్థలో సరుకుల డోర్ డెలివరీ లాంటి హామీలను సైతం కమల్ కురిపించారు.
ధనవంతులకే కాపలాదారు
తమిళనాడు, పుదుచ్చేరిలకు లోక్సభ ఎన్నికలకు తొలి జాబితాలో 21 మంది అభ్యర్థులను ఎంఎన్ఎం ఇంతకుముందు ప్రకటించింది. ఆ సమయంలో పోటీపై అడిగినపుడు తాను పోటీ చేయాలనుకుంటున్నాను గానీ, పార్టీ కార్యకర్తలే నిర్ణయించాలని చెప్పారు. అయితే ఈసారి సమావేశంలో మాత్రం ఆశ్చర్యకర విషయాలుంటాయని ముందే అన్నారు. కమల్ స్థాపించిన ఎంఎన్ఎం పార్టీ ద్రవిడ పార్టీలు వేటితోనూ పొత్తు పెట్టుకోలేదు. డీఎంకే, అన్నాడీఎంకే రెండింటినీ నిశితంగా విమర్శించారు. ప్రధాని మోదీపై కూడా విమర్శలు గుప్పించడంతో బీజేపీతోనూ పొత్తు లేదని తేలిపోయింది. ప్రధాని మోదీ ధనవంతులకే కాపలాదారని, ఎప్పుడూ జర్నలిస్టులను కలవరని విమర్శించారు. కాంగ్రెస్, రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియాలు ఎంఎన్ఎంతో పొత్తు దిశగా అడుగులు వేస్తున్నట్లు తెలుస్తోంది.