ముంబై: టెలికం రంగంలో చరిత్ర క్రియేట్ చేసిన రిలయన్స్ జియో తాజాగా కస్టమర్లకు భారీ ఝలక్ ఇచ్చింది. వాయిస్ కాల్స్కు చార్జీలు వసూలు చేయనున్నట్లు ప్రకటించింది. భారతీ ఎయిర్టెల్, వొడాఫోన్ ఐడియా వంటి టెలికం కంపెనీలకు కాల్ చేస్తే ఇప్పుడు చార్జీలు చెల్లించాల్సి ఉంటుంది. ఈ మేరకు రిలయన్స్ జియో చార్జీల కబురును తమ కస్టమర్లకు చేరవేసింది. నిమిషానికి ఆరు పైసలు చార్జీ వసూలు చేస్తామని పేర్కొంది. ఇంటర్కనెక్ట్ యూసేజ్ చార్జీల్లో (ఐయూసీ) భాగంగా ఆరు పైసలు వసూలు చేస్తున్నట్లు వివరణ ఇచ్చింది. జియో కస్టమర్ల నుంచి వసూలు చేసే ఐయూసీ చార్జీలను ఇతర టెలికం కంపెనీలకు చెల్లిస్తుంది.
అయితే 6 పైసలు చార్జీలకు గానూ కస్టమర్లకు అదనంగా డేటా అందిస్తామని కంపెనీ పేర్కొంది. దీంతో కస్టమర్లకు టారిఫ్ పెరినట్లు భావించొద్దని తెలిపింది. జియో నుంచి జియోకు, ల్యాడ్ లైన్స్కు, వాట్సాప్ కాల్స్ వంటి వాటికి ఎలాంటి చార్జీలు ఉండదని పేర్కొంది. అలాగే టారిఫ్ లో ఎలాంటి పెరుగుదల ఉండదని కంపెనీ తెలిపింది. అయితే ట్రాయ్ ఐయూసీ చార్జీలను తొలగించే వరకూ మాత్రమే ఈ ఐయూసీ చార్జీల వసూలు ఉంటుందని కంపెనీ తెలిపింది. జియో కస్టమర్లు ఎయిర్టెల్ లేదా వొడాఫోన్ ఐడియా నెంబర్లక కాల్ చేయాలంటే అదనపు టాపప్ వోచర్లు కొనుగోలు చేయాల్సి ఉంటుంది. వీటి ధర రూ.10, రూ.20, రూ.50, రూ.100గా ఉంది.
రిలయన్స్ జియో.. టెలికం ఇండస్ట్రీలో సంచలనం. వచ్చిన కొద్దికాలంలోనే ఫ్రీ ఆఫర్లతో ఊరించి.. అతి తక్కువ ధరకే డేటాను అందిస్తూ మొబైల్ యూజర్లను తనవైపుకు తిప్పుకుంది. అప్పటివరకూ టెలికం రంగంలో అగ్రస్థానంలో నిలిచిన ఇతర టెలికం ఆపరేటర్లు జియో దెబ్బకు దిగివచ్చాయి. సీజన్ కు తగినట్టుగా ఎక్కడా కూడా రాజీ పడకుండా తమ యూజర్లకు జియో డేటా ఆఫర్లు అందిస్తూ వస్తోంది. జియో ఫోన్, జియో ఫోన్ 2 మొబైల్ ఫోన్లను చౌకైన ధరకే ఇండియన్ మార్కెట్లలో రిలీజ్ చేసి కోట్లాది మంది యూజర్లను ఆకర్షించింది. రిలయన్స్ జియోలో 35 కోట్లు మంది యూజర్లు ఉన్నారు. రెండున్నర ఏళ్ల కాలంలో జియో తన డేటా సామ్రాజ్యాన్ని విస్తరించి టాప్ 2 ర్యాంకులో నిలిచింది. తద్వారా జియో ఇండియాలోనే రెండో అతిపెద్ద టెలికం కంపెనీగా రికార్డు సృష్టించిన సంగతి తెలిసిందే.