న్యూఢిల్లీ: జమ్మూకశ్మీర్ పునర్వ్యవస్థీకరణ బిల్లులో తప్పులు దొర్లాయి. మొత్తం ఈ బిల్లులో 52 తప్పులను గుర్తించారు. అయితే ఈ తప్పులను సరిచేస్తూ కేంద్రం గురువారం మూడు పేజీల తప్పొప్పుల పట్టికను విడుదల చేసింది. ఈ బిల్లులోని వాక్యాల్లో ఉన్న చాలా పదాల్లో.. ఇంగ్లీష్ అక్షరాలు చెరిగిపోగా.. మరి కొన్ని పదాల్లో ‘T’ అనే ఆంగ్ల అక్షరం అదనంగా వచ్చి చేరింది. ఆర్టికల్ అనే పదంలో ‘ఐ’ లేకుండా పోయింది. అలాగే టెరిటరీ అన్న పదంలో ఒక ‘టీ’ అక్షరం బదులుగా రెండు ‘టీ’ అక్షరాలు అచ్చుఅయ్యాయి. 1909 సంవత్సరాన్ని రాయాల్సిన చోట 1951 అనే సంవత్సరం ముద్రించారు. ఇలా చిన్న చిన్న తప్పులు బిల్లులో దొర్లాయి. అయితే ఆ తప్పులన్నింటిని ప్రభుత్వం సవరించింది. ఈ మార్పులన్నీ అక్టోబరు 31 నుంచి అమలులోకి రానున్నాయని కేంద్ర హోం శాఖ వర్గాలు తెలిపాయి. పార్లమెంట్ లో హడావిడిగా జమ్మూకశ్మీర్ విభజన బిల్లును ప్రవేశపెట్టడంతో తప్పులు దొర్లాయి.
జమ్మూ కశ్మీర్ రాష్ట్రానికి స్వతంత్ర ప్రతిపత్తి కల్పిస్తున్న ఆర్టికల్ 370ని ఆగస్ట్ 5న కేంద్ర ప్రభుత్వం రద్దు చేసింది. జమ్మూ కశ్మీర్ రాష్ట్రాన్ని రెండు భాగాలుగా విభజిస్తూ సంచలన నిర్ణయం తీసుకుంది. ఈ ప్రాంతాన్ని జమ్మూ కాశ్మీర్, లడఖ్ గా విభజించారు. జమ్మూ కాశ్మీర్ను చట్టసభతో కూడిన కేంద్రపాలిత ప్రాంతంగా, లడఖ్ ను పూర్తిగా కేంద్ర పాలిత ప్రాంతంగా చేశారు. ఆర్టికల్ 370 రద్దు బిల్లును ప్రవేశపెట్టిన రోజునే పార్లమెంట్ లో జమ్మూ కాశ్మీర్ విభజన బిల్లును కూడా ప్రవేశపెట్టారు. ఆగస్ట్ 7న చట్టసభల్లో ఈ బిల్లు పాస్ కావడంతో రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ ఆగస్ట్ 9న విభజన బిల్లుకు ఆమోదముద్ర వేశారు. జమ్ముకశ్మీర్లో ఆర్టికల్ 370 రద్దు సందర్భంగా ముందుజాగ్రత్త చర్యగా మాజీ సీఎంలు మెహబూబా ముఫ్తీ, ఒమర్ అబ్దుల్లాలతోపాటు పలు పార్టీలకు చెందిన రాజకీయ నాయకులను పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. వారు ఇప్పటికీ గృహ నిర్భందంలోనే ఉన్న సంగతి తెలిసిందే.