న్యూఢిల్లీ: ఐఎన్ఎక్స్ మీడియా, మనీలాండరింగ్ కేసులో కేంద్ర మాజీ ఆర్థిక మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత పి.చిదంబరానికి ఢిల్లీ కోర్టు జ్యుడిషీయల్ కస్టడీ విధించింది. నవంబర్ 13 వరకు తీహార్ జైల్లోనే ఉండాలని ఆదేశించింది. చిదంబరం ఈడీ కస్టడీ నేటితో ముగిసింది. దీంతో బుధవారం ఆయనను ఢిల్లీలోని ప్రత్యేక కోర్టులో హాజరుపరిచారు. మరో రోజు చిదంబరం కస్టడీని పొడిగించడానికి అనుమతి ఇవ్వాలని కోరుతూ ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అధికారులు దాఖలు చేసిన పిటీషన్ ను న్యాయమూర్తి తోసిపుచ్చారు. ఈ నేపథ్యంలో వచ్చే నెల 13వ తేదీ వరకు చిదంబరం తీహార్ జైలులోనే గడపనున్నారు.
తీహార్ జైలులో చిదంబరానికి అదనపు సౌకర్యాలను కల్పించడానికి కోర్టు అంగీకరించింది. చిదంబరం వయస్సు, వైద్య అవసరాలను దృష్టిలో ఉంచుకుని ఆయనకు మందులు, వెస్టరన్ టాయిలెట్, సెక్యూరిటీ, ప్రత్యేక సెల్ సౌకర్యాలు అందించాలని జైలు అధికారులకు కోర్టు సూచించింది. ఇంటి నుంచి భోజనాన్ని తెప్పించుకునే వెసలుబాటును ఇదివరకే కల్పించారు.
ఐఎన్ఎక్స్ కేసులో 74ఏళ్ల సీనియర్ కాంగ్రెస్ నేతను ఈడీ కస్టడీకి అనుమతి ఇస్తూ అక్టోబర్ 24న కోర్టు ఆదేశించింది. ఈడీ కస్టడీ నేటితో పూర్తి కావడంతో మరో రోజు చిదంబరాన్ని కస్టడీ కోరుతూ సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా ఈడీ తరపున కోర్టులో వాదించారు. సీనియర్ న్యాయవాది కపిల్ సిబాల్ చిదంబరం తరపున కోర్టులో వాదించారు. ఐఎన్ఎక్స్ మీడియా కేసులో సీబీఐ కస్టడీని చిదంబరానికి ఊరట లభించిన విషయం తెలిసిందే. సీబీఐ దాఖలు చేసిన కేసు విచారణ నుంచి చిదంబరానికి బెయిల్ ను మంజూరు చేసింది సుప్రీంకోర్టు. ఇదే కేసులో ఈడీ అధికారులు దాఖలు చేసిన కేసు నుంచి మాత్రం ఆయనకు ఊరట లభించట్లేదు. ఇదిలా ఉండగా, ఐఎన్ఎక్స్ మీడియా కేసులో ఆగస్టు 21న చిదంబరాన్ని సీబీఐ అధికారులు అరెస్ట్ చేశారు. విచారణ కోసం చిదంబరంను తీహార్ జైలుకు తరలించిన సంగతి తెలిసిందే.