స్విట్జర్లాండ్: ప్రపంచ బ్యాడ్మింటన్ చాంపియన్షిప్ టోర్నీలో భారత స్టార్ షట్లర్ పీవీ సింధు చరిత్ర సృష్టించింది. ఈ మెగా టోర్నీలో తొలిసారి భారత్కు ఆమె స్వర్ణ పతకం సాధించిపెట్టింది. ఆదివారం జరిగిన మహిళల సింగిల్స్ ఫైనల్లో సింధు 21-7, 21-7 తేడాతో ప్రత్యర్థి నొజొమి ఒకుహారా (జపాన్)ను చిత్తు చేసింది. 38 నిమిషాల్లోనే ముగిసిన ఏకపక్ష పోరులో ఆది నుంచి ఆధిపత్యం ప్రదర్శిస్తూ సరిగ్గా రెండేండ్ల క్రితం తనకెదురైన పరాజయానికి ఒకుహరపై దీటైన ప్రతీకారం తీర్చుకుంది. దీంతో ప్రతిష్ఠాత్మక ప్రపంచ బ్యాడ్మింటన్ చాంపియన్షిప్లో పసిడి గెలిచిన తొలి భారత షట్లర్గా అరుదైన ఘనతను సొంతం చేసుకున్నది. దీనికి ముందు ప్రపంచ చాంపియన్షిప్లో ఏ విభాగంలోనూ భారత్కు స్వర్ణం దక్కలేదు.
సింధుకు ప్రపంచ చాంపియన్షిప్ టోర్నీలో ఇది ఐదో పథకం. ఇదివరకు రెండు రజతాలు, రెండు కాంస్యాలు ఆమె సొంతం చేసుకుంది. మహిళల సింగిల్స్ విభాగంలో 2013, 2014ల్లో కాంస్యాలు సాధించిన ఆమె.. 2017, 2018ల్లో ఫైనల్స్ వెళ్లినా, రజతాలతో సరిపెట్టుకుంది. 2016 రియో ఒలింపిక్స్లోనూ రజతం సాధించింది. వచ్చే ఏడాది జరిగే ప్రతిష్ఠాత్మక టోక్యో (2020) ఒలింపిక్స్లో ప్రపంచ చాంపియన్గా సింధు పోటీకి దిగబోతున్నది. వరల్డ్ బ్యాడ్మింటన్ విజేతగా నిలిచిన సింధుకు రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్, ప్రధాని నరేంద్రమోదీ, రాష్ట్ర గవర్నర్ నరసింహన్, తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కేసీఆర్, వైఎస్ జగన్, తదితరులు ప్రత్యేకంగా అభినందనలు తెలిపారు.