ఇస్లామాబాద్: పాకిస్థాన్ ఇంటర్నేషనల్ ఎయిర్లైన్స్(పీఐఏ)కి చెందిన 46 విమానాల్ని ఇస్లామాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి ప్రయాణికులు లేకుండా నడిపిందట. ఈ మేరకు ఓ నివేదికలో వెల్లడైంది. అయితే ఇది 2016-17 సంవత్సరంలో జరిగింది. జీయో న్యూస్ తెలిపిన వివరాల ప్రకారం.. ఇలా ప్రయాణించడం వల్ల 180మిలియన్ పాకిస్తాన్ రూపాయలు వృథాగా ఖర్చు అయ్యాయని వెల్లడించింది. అయితే ఈ ఘటన వెలుగులోకి వచ్చినప్పటికీ ఎటువంటి విచారణ జరపలేదని తెలిపింది. పాక్ ఎయిర్ లైన్స్ పెను నష్టాల్లో కూరుకుపోయిన విషయం అధికారులకు తెలిసినప్పటికీ దీనిపై విచారణ చేపట్టలేదని పేర్కొంది.
ఈ 46 విమానాలతో పాటు హజ్ యాత్రికులను తీసుకు వెళ్లే 36 విమానాలు కూడా ప్రయాణికులు లేకుండానే గాల్లో ప్రయాణించాయట. పారిస్ కేంద్రంగా పనిచేస్తున్న యాంటీ మనీ లాండరింగ్ వాచ్ డాగ్ ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్ (ఎఫ్ఎటీఎఫ్) పాకిస్థాన్ ను ఇప్పటికే బ్లాక్ లిస్ట్ లో పెట్టింది. ప్రస్తుతం పాకిస్థాన్ ఆర్థిక పరిస్థితి బాలేదు. ఈ పరిస్థితుల్లో పాకిస్థాన్ వృథాగా విమానాలు నడుపుతున్నట్లు తాజాగా బయటపడింది. ఉగ్రవాద స్థావరాలపై చర్యలు తీసుకోకపోగా, వారికి ఆర్థికంగా సాయం చేస్తున్నట్టు పక్కా ఆధారాలు లభించడంతో ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్ (ఎఫ్ఏటీఎఫ్) పాక్ ఏకంగా బ్లాక్ లిస్ట్లో చేర్చుతూ కీలక నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే.