(న్యూస్ ఆర్బిట్ డెస్క్)
జనసేన అధినేత పవన్ కల్యాణ్ మాజీ భార్య, ప్రముఖ నటి రేణు దేశాయ్ సంచలన విషయం బయటపెట్టారు. తాను డెంగ్యూ వ్యాధి బారిన పడి.. ప్రస్తుతం కోలుకుంటున్నానని ఆమె తెలిపారు. ఈ విషయాన్ని ఆమె స్వయంగా సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. దోమలతో జాగ్రత్తగా ఉండాలని, ఇంటి పరిసర ప్రాంతాల్ని కూడా శుభ్రంగా ఉంచుకోవాని రేణు అభిమానులకు సూచించారు.
‘ఈటీవీలో ప్రసారం కాబోయే ఢీ ఛాంపియన్ షో కోసం షూటింగ్ జరిగింది. కొన్నిగంటల పాటు జరిగిన షూటింగ్ కు నేను కాదని చెప్పలేకపోయా. దోమల నుంచి జాగ్రత్తగా ఉండండి. మీ ఇంటి పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవడంతో పాటు పొడవైన దుస్తులనే ధరించండి’ అని రేణు దేశాయ్ ఇన్ స్టాగ్రామ్ లో పోస్ట్ చేశారు.
https://www.instagram.com/p/B2YxLMShImQ/?utm_source=ig_embed
ఇదిఇలా ఉంటే.. తెలంగాణ వ్యాప్తంగా డెంగ్యూ వ్యాధి విజృంభిస్తున్నాయి. విషజ్వరాలతో ప్రభుత్వ, ప్రైవేట్ ఆస్పత్రులన్నీ రోగులతో కిటకిటలాడుతున్నాయి. ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఓపీ దగ్గర రోగులు చికిత్స కోసం గంటల తరబడి పడిగాపులు కాయాల్సిన పరిస్థితి నెలకొంది. మరోవైపు డెంగ్యూపై తెలంగాణ ప్రభుత్వం కూడా చర్యలు చేపట్టింది. మంత్రి కేటీఆర్ ప్రగతిభవన్లో స్వయంగా ప్రత్యేక పారిశుద్ధ్య డ్రైవ్ని ప్రారంభించి.. డెంగ్యూపై యుద్ధాన్ని ప్రకటించారు. సీజనల్ వ్యాధుల నివారణ ప్రజల భాగస్వామ్యంతోనే సాధ్యమవుతుందన్నారు. బహిరంగ ప్రదేశాలు, పట్టణ ప్రాంతాల్లో మున్సిపాలిటీలు, జీహెచ్ఎంసీ తరుపున దోమల నివారణతో పాటు పరిశుభ్రత కోసం అన్ని విధాలుగా ప్రయత్నాలు చేయాలని పిలుపునిచ్చారు.