ఒకవైపు సార్వత్రిక ఎన్నికల షెడ్యూలు ముంచుకొచ్చేస్తోంది. లోక్ సభతో పాటు నాలుగు రాష్ట్రాల అసెంబ్లీలకు కూడా ఎన్నికల తేదీలు ప్రకటించేందుకు ఎన్నికల కమిషన్ సిద్ధమైపోయింది. ఆదివారం సాయంత్రమే ప్రకటన వచ్చేస్తోంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రధాన పార్టీలన్నీ అభ్యర్థుల జాబితాలు సిద్ధం చేసేసుకుని పోరుకు రెడీగా ఉన్నాయి. కానీ 175 స్థానాల్లోనూ పోటీ చేస్తామని చెప్పిన జనసేన విషయం మాత్రం ఏమైందో ఇంకా తెలియడం లేదు. ఒక్క పవన్ కల్యాణ్ తప్ప ఆ పార్టీలో ప్రజాకర్షణ గల నాయకులు ఎవ్వరూ కనిపించడం లేదు. నాదెండ్ల మనోహర్, రావెల కిశోర్ బాబు లాంటివాళ్లు చేరారు గానీ, వాళ్ల చరిష్మా నియోజకవర్గాలకే పరిమితం. రాష్ట్ర స్థాయిలో జనాన్ని ఆకట్టుకోగల నాయకులు ఎవ్వరూ ఇంకా కనిపించడం లేదు. పవన్ కూడా ఒకటి రెండు జిల్లాల్లో తిరుగుతున్నారు. తర్వాత కొన్నాళ్లు విరామం ఇస్తున్నారు. ఆ మధ్యలో పార్టీ కార్యకలాపాలు జరుగుతున్నాయో, లేదో ఎవరికీ తెలియడం లేదు. అభ్యర్థిత్వాల కోసం తాము నిర్వహిస్తున్న పరీక్షలకు ఇంతమంది వస్తున్నారని ఆ పార్టీ నాయకులు అప్పుడప్పుడు చెప్పుకొంటున్నారు. అందరి నుంచి బయోడేటాలు స్వీకరిస్తున్నారు. వాటిని పూర్తిస్థాయిలో పరీక్షించి, పరిశీలించి అప్పుడు అభ్యర్థులను ప్రకటిస్తామని అంటున్నారు.
వలసల జోరు
తెలుగుదేశం పార్టీ నుంచి వైఎస్ఆర్ సీపీలోకి, అలాగే అటు నుంచి తెలుగుదేశం పార్టీలోకి వలసలు పెరుగుతున్నాయి. గౌరు చరితారెడ్డి లాంటివాళ్లు టీడీపీలోకి వస్తున్నారు. అవంతి శ్రీనివాసరావు నుంచి దాసరి జైరమేష్ లాంటివారి వరకు ఫ్యాన్ గాలి కోసం ఇటు వచ్చేశారు. పశ్చిమగోదావరి జిల్లా నరసాపురం టీడీపీ ఎంపీ టికెట్ దాదాపు ఖరారైందనుకున్న రఘురామ కృష్ణంరాజు కూడా వైసీపీలోకి దూకేశారు. తెలుగుదేశానికి ఎంపీ అభ్యర్థులు కరువయ్యేలా చేయాలన్నది వైసీపీ పంతంలా కనిపిస్తోంది. ఇలా రెండు పార్టీలలో యాక్టివిటీ జోరుగా ఉంది. కానీ మూడోపక్షంగా గట్టిపోటీ ఇస్తామని ముందునుంచి చెబుతున్న జనసేనలో మాత్రం ఏం జరుగుతోందో ఎవరికీ తెలియడం లేదు.
స్పందన ఏదీ?
రాష్ట్రంలో ఓటర్ల జాబితాలోంచి కొంతమంది పేర్లు పోయాయని ముమ్మరంగా ప్రచారం జరిగింది. టీడీపీకి చెందిన సేవామిత్ర యాప్ గురించి.. దానిద్వారా జరిగిందన్న డేటా చౌర్యం గురించి గగ్గోలు పుట్టింది. వైసీపీ వాళ్లే ఓట్ల తొలగింపునకు ఫారం-7లు ఇచ్చారన్నది టీడీపీ వాదన. తెలంగాణ, ఏపీ ప్రభుత్వాలు పోటాపోటీగా ‘సిట్’ నియామకాలూ చేశాయి. గవర్నర్ వరకు ఈ విషయం వెళ్లింది. ఇంత పెద్ద అంశం గురించి జనసేన పార్టీ వైపు నుంచి మాత్రం స్పందన పెద్దంతగా కనిపించనే లేదు. రాష్ట్ర రాజకీయాల్లో క్రియాశీల పాత్ర పోషించాలంటే కీలకాంశాల గురించి సమయానికి స్పందించాలి. ఈ విషయాన్ని పవన్ కల్యాణ్ కు ఆయన సలహాదారులు చెబుతున్నారో లేదో తెలియడం లేదు.
అభ్యర్థులు ఎక్కడ?
టీడీపీ, వైసీపీలలో ఒక్కో నియోజకవర్గానికి బోలెడంత పోటీ ఉంది. పాతవాళ్లు, కొత్తవాళ్లు, మధ్యలో పార్టీ మారినవాళ్లు.. ఇలా రకరకాల అభ్యర్థులున్నారు. వారిలో ఎవరికి చాన్సివ్వాలా అని రెండు పార్టీలు తల పట్టుకుంటున్నాయి. కానీ జనసేన మాత్రం ఎక్కడ ఎవరిని బరిలోకి దించుతుందో అర్థం కావడం లేదు. మంచి చరిత్ర ఉంటే సామాన్యులకైనా టికెట్ ఇస్తామంటున్నారు. కానీ ఓటుకు 5-10 వేల వరకు పలుకుతున్న ప్రస్తుత తరుణంలో సామాన్యులు ఎలా తట్టుకోగలరు? అసలు పార్టీ ఉనికి చాటాలన్నా వీలుపడుతుందా? ఎంతకాదన్నా ఏపీలో ఎన్నికలంటే డబ్బుల కట్టలు తెగాల్సిందే. దాన్ని ఎవరూ కాదనలేరు. అలాంటిది మరక లేకుండా తెల్ల లాల్చీ, పంచె కట్టుకుని వస్తానంటే ఆదరించేది ఎవరు?
ప్రాక్టికాలిటీకి దూరం
రాజకీయాల్లో విలువలు ఉండాలని చెప్పడంతోపాటు వాటిని అమలు చేయడానికి ప్రయత్నించిన లోక్ సత్తా పార్టీ విషయం ఏమైందో అందరూ చూశారు. ప్రాక్టికాలిటీకి దూరంగా ఉంటూ.. ముఖ్యమంత్రి అయ్యి తీరుతానని చెబితే చాలదు. టీ గ్లాసు గుర్తు వచ్చినపుడు దాన్ని జనంలోకి తీసుకెళ్లడానికి ఇంతవరకు ప్రయత్నాలు చేసినట్లు కనిపించలేదు. సోషల్ మీడియాలో ఒకవైపు టీడీపీ – వైసీపీల మధ్య యుద్ధం జరుగుతున్నా ఆ దిశగా జనసేన వర్గాలు ఆలోచించినట్లు కూడా లేదు. గత ఎన్నికల్లో సోషల్ మీడియా ఎంత ప్రభావం చూపిందో అందరికీ తెలుసు. కాబట్టి ఇప్పటికైనా పవన్, ఆయన సలహాదారులు మేలుకుని వేగంగా అడుగులు వేయడం మంచిది.