అమరావతి: పోలవరం ప్రాజెక్టు పనులకు రాష్ట్ర ప్రభుత్వం రివర్స్ టెండర్లను ఆహ్వానించింది. ఈ మేరకు శనివారం నోటిఫికేషన్ను విడుదల చేసింది. మొత్తం 4900కోట్ల రూపాయలతో రివర్స్ టెండరింగ్ ప్రక్రియను ప్రారంభించింది. వీటిలో హెడ్ వర్క్ పనులకు 1800కోట్ల రూపాయలు, హైడల్ ప్రాజెక్టు పనులకు 3100కోట్ల రూపాయల అంచనాలతో టెండర్ల నోటిఫికేషన్ను విడుదల చేసింది. 2015-16 ఎస్ఎస్ఆర్ రేట్ల ప్రకారం రివర్స్ టెండరింగ్ ప్రక్రియను ప్రారంభించింది.
అంచనాలను గతంలో భారీగా పెంచారని ప్రభుత్వం ఆరోపించిన సంగతి తెలిసిందే.
రివర్స్ టెండరింగ్ నిర్ణయం ఊహించని పరిణామాలకు దారి తీస్తుందనీ, ఈ ఆలోచన విరమించుకోవాలని పోలవరం ప్రాజెక్టు అథారిటీ (పిపిఏ) సిఇఒ అర్కె జైన్ శుక్రవారం జలవనరుల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాధ్ దాస్కు లేఖ రాశారు. అయితే పిపిఏ సూచనలను సైతం రాష్ట్ర ప్రభుత్వం పక్కన బెట్టి రివర్స్ టెండరింగ్కు నోటిఫికేషన్ జారీ చేసింది.
జగన్మోహనరెడ్డి ప్రభుత్వం సామర్థ్యం తెలియక, గత టిడిపి ప్రభుత్వ పనితీరు పరిగణలోకి తీసుకొని పిపిఎ ఆ విధంగా వ్యాఖ్యానించినట్లు అనిపిస్తోందని జలవనరుల శాఖ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ పేర్కొన్నారు. సెప్టెంబర్ 15కల్లా రివర్స్ టెండరింగ్ ప్రక్రియ పూర్తి చేస్తామనీ, నవంబర్ ఒకటి నుండి పనులు ప్రారంభమవుతాయని ఆయన చెప్పారు.
2021 జూన్ నాటికి పోలవరం నిర్మాణం పూర్తి అవుతుందని మంత్రి అనిల్ కుమార్ వెల్లడించారు.