అమేఠీ: కేంద్ర మంత్రి, అమేఠీ బిజెపి అభ్యర్థి స్మృతి ఇరానీ ఓటర్లను ప్రలోభ పెడుతున్నారంటూ కాంగ్రెస్ ఈస్ట్ యూపి ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ ఆరోపించారు. ఆదివారం ప్రియాంక గాంధీ మాట్లాడుతూ ప్రజలకు తప్పుడు హామీలను ఇస్తూ కానుకలను ఎర చూపుతున్నారని అన్నారు. నియోజకవర్గంలో ఓటర్లకు చీరలు, చెప్పులు పంపిణీ చేస్తున్నారని ప్రియాంక మరో సారి విమర్శలు చేశారు. స్మృతి ఇరానీ చెప్పులు పంచడం ద్వారా ప్రజలను అవమానిస్తున్నారనీ, వాటిని ఆమెకే తిరిగి ఇచ్చి వేయాలని ఇటీవల ఆమేఠీలో ప్రజలతో మాట్లాడుతూ ప్రియాంక సూచించారు.
అమేఠీ ప్రజలకు ఎవరి ముందూ చేయిచాపరనీ, ఆ అవసరం వారికి లేదని ప్రియాంక అన్నారు. దశాబ్దాలుగా గాంధీ కుటుంబ సభ్యుల పట్ల అమేఠీ ప్రజలు చెక్కు చెదరని ప్రేమ, అప్యాయతలు కనబరుస్తున్నారని ప్రియాంక కొనియాడారు.
ఆమేఠీ లోక్సభ స్థానం నుండి రాహుల్ గాంధీ పోటీ చేస్తుండగా, ప్రత్యర్థిగా బిజెపి తరపున స్మృతి ఇరానీ బరిలో ఉన్నారు. గత ఎన్నికల్లోనూ రాహుల్ పై పోటీ చేసి లక్ష ఓట్లకుపైగా తేడాతో ఓడిపోయారు.