న్యూఢిల్లీ: జమ్ముకశ్మీర్కు స్వయం ప్రతిపత్తి కల్పించే ఆర్టికల్ 370 రద్దును సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లపై సుప్రీంకోర్టు విచారణ చేపట్టింది. ఆర్టికల్ 370 రద్దు సహా కశ్మీర్ పరిస్థితులపై దాఖలైన వ్యాజ్యాలను జస్టిస్ ఎన్.వి.రమణ నేతృత్వంలోని ఐదుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం విచారించింది. పిటిషన్లపై సమాధానం ఇచ్చేందుకు కేంద్రానికి నాలుగు వారాల గడువిచ్చింది. తదుపరి విచారణను నవంబర్ 14కు వాయిదా వేసింది. సమాధానం ఇచ్చేందుకు కేంద్రానికి రెండు వారాలకు మించి గడువు ఇవ్వకూడదన్న వ్యాజ్యాన్ని సుప్రీం కొట్టిపారేసింది. ఆర్టికల్ 370 రద్దును సవాలు చేస్తూ కొత్త వ్యాజ్యాలు దాఖలు చేయకూడదని సుప్రీం కోర్టు ఆదేశించింది. కేంద్రం కౌంటర్ దాఖలు చేసిన వారం రోజులకు తమ సమాధానం అందివ్వాలని పిటిషనర్లకు సూచించింది.
జమ్మూ కశ్మీర్ రాష్ట్రానికి స్వతంత్ర ప్రతిపత్తి కల్పిస్తున్న ఆర్టికల్ 370ని ఆగస్ట్ 5న కేంద్ర ప్రభుత్వం రద్దు చేసింది. రాష్ట్రాన్ని రెండు కేంద్రపాలిత ప్రాంతాలుగా విభజించింది. జమ్మూ కాశ్మీర్ను చట్టసభతో కూడిన కేంద్రపాలిత ప్రాంతంగా, లడఖ్ ను పూర్తిగా కేంద్ర పాలిత ప్రాంతంగా చేశారు. ఆర్టికల్ 370 రద్దు బిల్లును ప్రవేశపెట్టిన రోజునే పార్లమెంట్ లో జమ్మూ కాశ్మీర్ విభజన బిల్లును కూడా ప్రవేశపెట్టారు. చట్టసభల్లో ఈ బిల్లు పాస్ కావడంతో రాష్ట్రపతి ఆగస్ట్ 9న విభజన బిల్లుకు ఆమోదముద్ర వేశారు. జమ్ముకశ్మీర్లో ఆర్టికల్ 370 రద్దు సందర్భంగా ముందుజాగ్రత్త చర్యగా మాజీ సీఎంలు మెహబూబా ముఫ్తీ, ఒమర్ అబ్దుల్లాలతోపాటు వందలాది మంది రాజకీయ నాయకులూ, కార్యకర్తలూ గృహ నిర్బంధలోనో, జైళ్లలోనో ఉన్నారు.