న్యూఢిల్లీ: మహారాష్ట్రలో ప్రభుత్వ ఏర్పాటు కోసం గవర్నర్ కు ఇచ్చిన మద్దతు లేఖలను తమకు సోమవారం(నవంబర్ 25) ఉదయం 10.30లోగా సమర్పించాలని కేంద్రం, మహారాష్ట్ర ప్రభుత్వాలను సుప్రీం కోర్టు ఆదేశించింది. ఆదివారం శివసేన, ఎన్సీపీ, కాంగ్రెస్ పార్టీల పిటిషన్ పై విచారించిన న్యాయస్థానం..ప్రభుత్వ ఏర్పాటుకు గవర్నర్ కు అందించిన మద్దతు లేఖలను సమర్పించాలని ఆదేశిస్తూ కేంద్రతో పాటు మహారాష్ట్ర సీఎం ఫడ్నవీస్, ఎన్సీపీ తిరుగుబాటు నేత అజిత్ పవార్ లకు నోటీసులు జారీ చేసింది. తమకు సోమవారం సొలిసిటర్ జనరల్ ఈ లేఖలు సమర్పించిన తర్వాత బలపరీక్ష పిటిషన్ పై నిర్ణయం తీసుకుని ప్రకటిస్తామని, తక్షణమే బలపరీక్ష అవసరంలేదని పేర్కొంది. అనంతరం ఈ పిటిషన్ పై విచారణను రేపటికి వాయిదా వేసింది.
మహారాష్ట్రలో బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు చేయడంపై శివసేన, ఎన్సీపీ, కాంగ్రెస్ పార్టీలు అభ్యంతరం వ్యక్తం చేస్తూ సుప్రీం కోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే. తమ కూటమికి 144 మందికిపైగా ఎమ్మెల్యేల మద్దతు ఉందని పిటిషన్లో పేర్కొన్నాయి. ప్రభుత్వ ఏర్పాటుకు శివసేన, ఎన్సీపీ, కాంగ్రెస్ను ఆహ్వానించేలా ఆదేశాలివ్వాలని సుప్రీంకోర్టును కోరాయి. ఫడ్నవీస్ను 24 గంటల్లోగా బలం నిరూపించుకునేలా ఆదేశాలు ఇవ్వాలని తమ పిటిషన్లో పేర్కొన్నాయి. ఈ పిటిషన్పై అత్యవసర విచారణ చేపట్టాలని కోరగా.. సుప్రీంకోర్టు ఇందుకు అంగీకరించి ఇవాళ విచారణ చేపట్టింది.
కాంగ్రెస్-ఎన్సీపీ- శివసేన తరఫున కాంగ్రెస్ నేత, సీనియర్ న్యాయవాది కపిల్ సిబల్, బీజేపీ తరఫున ముకుల్ రోహత్గీ వాదనలు వినిపించారు. సంఖ్యాబలంలేని బీజేపీని ప్రభుత్వ ఏర్పాటుకు గవర్నర్ ఎలా ఆహ్వానిస్తారని, ఎన్నికలకు ముందు ఏర్పాటైన కూటమి విచ్ఛిన్నమైందని కపిల్ సిబల్ తెలిపారు. ప్రస్తుతం కాంగ్రెస్-ఎన్సీపీ- శివసేన కూటమిగా ఏర్పడ్డాయని, రాష్ట్రపతి పాలన తొలగించాలని గవర్నర్ సిఫార్సు చేయడం ఏంటని ప్రశ్నించారు. రాత్రికి రాత్రే నిర్ణయం తీసుకుని కేబినెట్ ఆమోదం లేకుండా ఎలా రాష్ట్రపతి పాలన రద్దుచేస్తారని నిలదీశారు. గవర్నర్ ఏకపక్షంగా వ్యవహరించారని తెలిపారు. ప్రభుత్వ ఆహ్వానానికి కనీసం లేఖ పంపకుండా, ఎమ్మెల్యేలను పిలవకుండా ఎలా ప్రమాణస్వీకారం చేస్తారని ప్రశ్నించారు. బీజేపీకి బలం ఉంటే తక్షణమే నిరూపించుకోవాలని, లేదంటూ తమకు అవకాశం ఇవ్వాలని కపిల్ సిబల్ కోరారు. తక్షణమే బలనిరూపణ చేసుకోవాలని బీజేపీ ప్రభుత్వాన్ని ఆదేశించాలని తెలిపారు.
కర్ణాటకలో కూడా ఇలాంటి పరిణామాలే చోటుచేసుకున్నాయని, అక్కడ 24 గంటల్లో బలపరీక్షకు ఆదేశాలిచ్చారని ధర్మాసనానికి సిబల్ గుర్తు చేశారు. అవసరమైతే కాంగ్రెస్, ఎన్సీపీ, శివసేన కూటమి రేపే బలనిరూపణకు సిద్ధంగా ఉన్నాయన్నారు.
అజిత్ పవార్ ఎలా ప్రమాణం చేస్తారని, ఆయనకు ఏ ఎమ్మెల్యే మద్దతూ లేదని మరో సీనియర్ న్యాయవాది అభిషేక్ మను సింఘ్వీ అన్నారు. ఎమ్మెల్యేల సంతకాలతో అజిత్ ఇచ్చిన లేఖ చెల్లదని ఆయన స్పష్టం చేశారు. తమ పార్టీకి చెందిన 41 మంది ఎమ్మెల్యేలు ఆయన వెంటలేనప్పుడు ప్రభుత్వ ఏర్పాటుకు అనుమతించి ప్రజాస్వామ్యాన్ని ఖూనీచేశారని పేర్కొన్నారు.
బీజేపీ తరఫున వాదనలు వినిపించిన ముకుల్ రోహత్గీ.. గవర్నర్ రాజ్యాంగ నిబంధనలకు అనుగుణంగా వ్యవహరించారని అన్నారు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 361ప్రకారం స్వీయనిర్ణయాధీకారం గవర్నర్కు ఉందని స్పష్టం చేశారు. గవర్నర్ నిర్ణయాన్ని కోర్టుల్లో సవాల్ చేయలేరని అన్నారు. అసెంబ్లీని సమావేశపరిచి, ప్రొటెం స్పీకర్ను నియమించి, గవర్నర్ ప్రసంగం, బలపరీక్ష జరిగేలా ఆదేశాలివ్వాలని సుప్రీంకోర్టును అభ్యర్థించారు.
కాగా, సోమవారం సుప్రీంకోర్టు ఎలాంటి తీర్పు ఇస్తుందోనన్న టెన్షన్ సర్వత్రా కొనసాగుతోంది.