ఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో కాంగ్రెస్, ఆప్ పార్టీల పొత్తు, సీట్ల సర్దుబాటు తేలలేదు. ఆ పార్టీల మధ్య ప్రతిష్టంబన కొనసాగుతూనే ఉంది. ఢిల్లీలోని ఏడు పార్లమెంట్ స్థానాల్లో నాలుగు ఆప్ కి కేటాయించడానికి ఎఐసిసి అధ్యక్షుడు రాహుల్ గాంధీ సుముఖత వ్యక్తం చేస్తున్నట్లు వార్తలు వచ్చాయి. సిఎం అరవింద్ కేజ్రీవాల్, రాహుల్ గాంధీల మధ్య ట్వీట్ ల యుధ్దం జరుగుతోంది.
ఈ నేపధ్యంలోనే ఢిల్లీ పిసిసి అధ్యక్షురాలు షీలాదీక్షిత్ ఈ ఎన్నికల్లో ఢిల్లీ తూర్పు పార్లమెంట్ నుండి పోటీ చేయనున్నారని ఆ పార్టీ వర్గాల ద్వారా తెలుస్తోంది. ఈ విషయంపై పార్టీలో చర్చ జరిగినట్లు సమాచారం. షీలాధీక్షిత్ కూడా పోటీ చేయడానికి సుముఖత వ్యక్తం చేసినట్లు సమాచారం. అమె కుమారుడు సందీప్ దీక్షిత్ పోటీ చేయడానికి నిరాకరించడంతో షీలాధీక్షత్ బరిలోకి దిగుతున్నట్లు తెలుస్తోంది.
సీనియర్ కాంగ్రెస్ నేత అజయ్ మాకెన్ న్యూఢిల్లీ నుండి, రాజ్యసభ సభ్యుడు కపిల్ సిబాల్ చాందీచౌక్ పార్లమెంట్ స్థానాల నుండి పోటీ చేయనున్నట్లు సమాచారం, పొత్తులు ఖరారు కానిపక్షంలో మాజీ పార్లమెంట్ సభ్యులు మహబల్ మిశ్రా, జెపి అగర్వాల్, రమేష్ శర్మ, రాజ్ కుమార్ చౌహన్ లు పార్లమెంట్ స్థానాలకు పోటీ చేయనున్నట్లు తెలుస్తోంది.
షీలాదీక్షిత్ మూడు సార్లు ఢిల్లీ సిఎంగా బాధ్యతలు నిర్వహించారు.