వారణాసి: ప్రధాని నరేంద్ర మోదికి ప్రత్యర్థిగా వారణాసి నుంచి కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ ఎన్నికల బరిలో నిలవనున్నారు. ఈ మేరకు ఆమె భర్త రాబర్ట్ వాద్రా వెల్లడించారు.
మంగళవారం రాబర్ట్ వాద్రా మీడియాతో మాట్లాడుతూ.. ‘ వారణాసి నుంచి పోటీ చేసేందుకు ప్రియాంక అంగీకరించింది. ఈ అంశంపై పార్టీ తుది నిర్ణయం తీసుకుంటుంది’ అని అన్నారు.
కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శిగా ప్రియాంక గాంధీ బాధ్యతలు స్వీకరించినప్పటి నుంచి ప్రచారంలో కీలకంగా వ్యవహరిస్తున్నారు. తల్లి సోనియా గాంధీ,సోదరుడు రాహుల్ గాంధీ నామినేషన్ పత్రాలు సమర్పించినప్పుడూ ప్రియాంక వారి వెంటే ఉన్నారు.
ప్రియాంక గాంధీ వారణాసి నుంచి పోటీ చేసే అవకాశం ఉందని గత కొద్ది రోజులుగా వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఇందుకు అనుగుణంగా వారణాసిలో పార్టీ తరుపున పోటీ చేసే అభ్యర్థిని కాంగ్రెస్ ఇంతవరకూ ప్రకటించలేదు. అయితే ఈ ప్రచారాన్ని కాంగ్రెస్ అధికార ప్రతినిధి రణదీప్ సూర్జేవాలా కొట్టిపారేశారు. ప్రియాంక గాంధీ పోటీ విషయంలో తుది నిర్ణయం తీసుకుంటే తప్పకుండా వెల్లడిస్తామని తెలిపారు.
ఈ నేపథ్యంలో ప్రియాంక పోటీపై సందిగ్థ నెలకొన్నది. అసలు కాంగ్రెస్ పార్టీ వారాణసిలో తమ పార్టీ అభ్యర్థిని బరిలో నిలుపుతుందా లేదా అనే అనుమానాలు వ్యక్తమయ్యాయి. ఎట్టకేలకు రాబర్ట్ వాద్రా ఈ అనుమానాలను నివృత్తి చేశారు.