చెన్నై: సినిమాల నుంచి రాజకీయాల్లోకి వచ్చిన కమల్ హాసన్.. నాథూరాం గాడ్సేపై చేసిన వ్యాఖ్యలకు గాను ఆయనపై చెప్పులతో దాడి జరిగింది. తమిళనాడులోని మదురై జిల్లా తిరుప్పరాంకుంద్రం అసెంబ్లీ నియోజకవర్గ ప్రచారంలో ఉండగా ఈ ఘటన జరిగింది. స్వతంత్ర భారత దేశంల తొలి ఉగ్రవాది అయిన గాడ్సే ఒక హిందువని ఆయన ఇంతకుముందు వ్యాఖ్యానించారు. బీజేపీ కార్యకర్తలతో పాటు హనుమాన్ సేన సభ్యులు కలిపి మొత్తం 11 మందిపై చెప్పులు విసిరారని పోలీసులకు ఫిర్యాదు అందింది. కమల్ ప్రజలనుద్దేశించి మాట్లాడుతుండగా వాళ్లు ఆయనపై చెప్పులు విసిరారు. చెప్పులు నేరుగా ఆయనకు తగల్లేదు గానీ, జనంలో పడిపోయాయని పోలీసులు చెప్పారు.
మహాత్మాగాంధీని చంపిన గాడ్సేపై కమల్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. అరవకురిచిలో ఆదివారం ప్రచారం సందర్భంగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ‘‘ఇది ముస్లిం ప్రాబల్య ప్రాంతం కాబట్టి నేనీ విషయం చెప్పడం లేదు. కానీ గాంధీ విగ్రహం వద్ద నిలబడి చెబుతున్నా. స్వతంత్ర భారత దేశంలో మొట్టమొదటి తీవ్రవాది హిందువు. అతడి పేరు నాథూరాం గాడ్సే. అక్కడే అది మొదలైంది’’ అన్నారు. ఆదివారం నాడు అవరకురిచి, తిరుప్పరాంకుంద్రం సహా నాలుగు అసెంబ్లీ నియోజకవర్గాలకు ఉప ఎన్నిక ఉంది. ఈ ఎన్నికల్లో కమల్ పార్టీ మక్కల్ నీది మయ్యమ్ (ఎంఎన్ఎం) తరఫున అభ్యర్థులు బరిలో ఉన్నారు.
కాగా, కమల్ వ్యాఖ్యలను తమిళనాడు బీజేపీ అధ్యక్షురాలు తమిళిసై సౌందరరాజన్ ఖండించారు. ‘‘కమల్ వ్యాఖ్యలను మేం తీవ్రంగా ఖండిస్తున్నాం. ఎన్నికల ప్రచారంలో ఆయన హిందూ ఉగ్రవాదం గురించి మాట్లాడారు. మైనారిటీలు ఎక్కువగా ఉండే ప్రాంతంలో ఇలా మాట్లాడి ఆయన మత ఘర్షణలను రెచ్చగొడుతున్నారు. ఎన్నికల సంఘం కమల్ హాసన్ మీద కఠిన చర్యలు తీసుకోవాలి’’ అని ఆమె ట్వీట్ చేశారు. తమిళనాడు మంత్రి కేటీ రాజేంద్ర బాలాజీ కూడా కమల్ వ్యాఖ్యలకు తీవ్రంగా స్పందించి, ఆయన నాలుక కోసేయాలన్నారు. ఉగ్రవాదానికి మతం లేదని వాళ్లు హిందువులు, ముస్లింలు, క్రిస్టియన్లు కారని అన్నారు. కమల్ వ్యాఖ్యలపై ఇప్పటికే పోలీసు కేసు నమోదైంది. అయితే తాను చెప్పింది చారిత్రక సత్యమని కమల్ అన్నారు. తాను ఒక మతాన్ని గురించి ఎలా చెబుతానని అడిగారు. మద్రాస్ హైకోర్టులో ఆయన ముందస్తు బెయిల్ కోసం దరఖాస్తు చేశారు.