అమేథి: ఉత్తరప్రదేశ్ లో కాంగ్రెస్ కంచుకోట అయిన అమేథీలో కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీని రెండోసారి ఢీకొంటున్న అభ్యర్థి.. స్మృతి ఇరానీ. తనకు డిగ్రీ పూర్తి కాలేదని ఆమె తన ఎన్నికల అఫిడవిట్ లో పేర్కొన్నారు. తన మూడేళ్ల డిగ్రీకోర్సు పూర్తి కాలేదని ఆమె అఫిడవిట్ లో వెల్లడించడం ఇదే మొదటిసారి. తన అత్యధిక విద్యార్హత అన్నచోట ‘బ్యాచిలర్ ఆఫ్ కామర్స్ పార్ట్ 1’ అని పేర్కొన్నారు. ఢిల్లీ యూనివర్సిటీలోని స్కూల్ ఆఫ్ ఓపెన్ లెర్నింగ్ (కరస్పాండెన్స్) నుంచి ఇది చేసినట్లు చెప్పారు. అది 1994 సంవత్సరం అని చెప్పారు గానీ, పూర్తిచేసినట్లు లేదు. మూడేళ్ల డిగ్రీ కోర్సు పూర్తి కాలేదని బ్రాకెట్లలో రాశారు. 2017లో రాజ్యసభ సభ్యురాలిగా పోటీ చేసినపుడు కూడా ఆమె ఇదే తరహాలో అఫిడవిట్ దాఖలుచేశారు.
2014లో అమేథి నుంచి తొలిసారి పోటీ చేసినపుడు కూడా ఆమె బీకాం పార్ట్-1 ఢిల్లీ యూనివర్సిటీలోని స్కూల్ ఆఫ్ ఓపెన్ లెర్నింగ్ (కరస్పాండెన్స్) నుంచి చేసినట్లు పేర్కొన్నారు. అంతకుముందు 2014లో మాత్రం ఆమె ఢిల్లీలోని చాందినీ చౌక్ నియోజకవర్గంలో కపిల్ సిబల్ మీద పోటీ చేసినపుడు 1996ల ఢిల్లీ యూనివర్సిటీ (స్కూల్ ఆఫ్ కరస్పాండెన్స్) నుంచి బీఏ చదివినట్లు అఫిడవిట్ లో పేర్కొనడం విశేషం.
తనకు రూ. 4.71 కోట్ల విలువైన ఆస్తులున్నట్లు మంత్రి తాజాగా పేర్కొన్నారు. స్మృతి ఇరానీ విద్యార్హతల విషయంలో గందరగోళంపై ప్రతిసారీ కాంగ్రెస్, ఇతర ప్రతిపక్షాలు వేలెత్తి చూపిస్తాయి. రెండేళ్ల క్రితం అహ్మద్ ఖాన్ అనే వ్యక్తి దీనిపై పిటిషన్ వేయగా ఢిల్లీ కోర్టు దాన్ని కొట్టేసింది. అదంతా అనవసరంగా ఆమెను వేధించడమేనని కోర్టు చెప్పింది. ఈ తీర్పును ఆయన ఢిల్లీ హైకోర్టులో సవాలుచేశారు.
బీజేపీలో మంత్రిపదవి సాధించడానికి షార్ట్ కట్.. నకిలీ డిగ్రీలని రాహుల్ గాంధీ గత నవంబరులో ట్వీట్ చేశారు. ఢిల్లీ యూనివర్సిటీ విద్యార్థి సంఘ ఎన్నికలలో గెలిచిన ఏబీవీపీ సభ్యుడు అంకివ్ బసోయా.. నకిలీ డిగ్రీతో యూనివర్సిటీలో చేరాడన్న ఆరోపణల నేపథ్యంలో ఆయనీ వ్యాఖ్యలు చేశారు.