(న్యూస్ ఆర్బిట్ బ్యూరో)
ఇది విన్నారా, మీడియాకు రెండేళ్ల పాటు ఎటువంటి ప్రకటనలు ఇవ్వవద్దట. మీడియా ఎలా బతకాలి. వాళ్ళ చావు వాళ్ళు చావనీ అని ప్రధాన మంత్రి నరేంద్ర మోడికి యూపిఏ చైర్ పర్సన్ సోనయాగాంధీ సూచించారుట. విపక్ష నాయకుల సలహాలు వింటున్న మోడీ వాటిని ఆచరణలో పెడితే…, మరీ ముఖ్యంగా ఈ సూచన ఆచరణలో పెడితే మాత్రం జాతీయ మీడియాకు, స్థానిక మీడియాకు మూలిగే నక్కపై తాటికాయ పడినట్టే.
కరోనా మహమ్మారి ప్రపంచవ్యాప్తంగా మరణమృదంగం మోగిస్తోంది. ప్రపంవ్యాప్తంగా 13,86,906 మందికి కరోనా వైరస్ బారిన పడగా 79,071 మంది మృత్యువాత పడ్డారు. దేశవ్యాప్తంగా 4,789 కేసులు నమోదు కాగా 124 మంది మృతి చెందారు. కరోనా ప్రభావం అన్ని వర్గాలపై పడింది. ధనవంతుడు, పేద అనే తేడా లేకుండా అందరూ వారి వారి స్థాయిలో నష్టాలను చవి చూస్తున్నారు. ప్రభుత్వాలు తీవ్ర ఆర్ధిక సంక్షోభంలోకి నెట్టి వేయబడ్డాయి. దేశం చాలా క్లిష్టమైన పరిస్థితులను ఎదుర్కొంటోంది. ఈ నేపథ్యంలో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ప్రస్తుత పరిస్థితిని అధిగమించేందుకు సహకరించాలని, సూచనలు, సలహాలు అందించాలని మాజీ ప్రధానులు, మాజీ రాష్ట్రపతులు, ముఖ్య నేతలకు ఫోన్ చేసి మరీ కోరారు.
అయితే దీనిలో పెద్ద విశేషం ఏమి లేకపోయినా అసలు విషయం ఇక్కడ వుంది. అధికార పక్షమైనా, ప్రతిపక్షం అయినా అన్ని విషయాల్లో మీడియా సహకారం తీసుకోవడం, వారికి ప్రకటనల రూపంలోనో మరో విధంగానో సహకరించటం తెలిసిందే. అయితే ఇక్కడ విశేషం ఏమిటంటే యూపిఏ చైర్ పర్సన్ సోనియా గాంధీ ఇచ్చిన సలహా. ఇప్పటికే ఆదాయం లేక అరకొర ఆదాయంతో, సర్కులేషన్ పడిపోయి, టీఆర్ పి లు పడిపోయి కొట్టుమిట్టాడుతున్న మీడియా రంగానికి ప్రకటనలు నిలిపివేయడం అనేది అశనిపాతం. ప్రస్తుత పరిస్థితుల్లో మీడియాకు ప్రకటనలు నిలిపి వేయడం ఈ రంగానికి ఓ పెద్ద దెబ్బ. సోనియా సూచనలు మోడీ పాటిస్తారా?, లేదా? అనేది సందేహత్మకమే. మోడీది ప్రతిపక్షాల సిఫార్సులు, ఆలోచనలు పట్టించుకునే మనస్తత్వం కాదు. అయితే ఏమో ఈ ఆర్థిక కష్టకాలంలో ఆర్ధికంగా ఇబ్బందులు ఉన్నాయి కాబట్టి సోనియా సూచనలు పటిస్తారా లేదా చూడాలి.
కరోనా విపత్తు నేపథ్యంలో మీడియాకు రెండేళ్ల పాటు అన్ని రకాల ప్రకటనలు నిలిపి వేయాలని ప్రధాని మోడీకి సోనియాగాంధీ సూచించారు. ఈ మేరకు మోడీకి సోనియా లేఖ రాశారు. దేశం కష్టకాలంలో ఉన్నప్పుడు ప్రచారాల కోసం ప్రభుత్వం మీడియాకు ఇచ్చే రకాల ప్రకటనలను వెంటనే నిలిపేసి, ఆ డబ్బుల్ని ప్రధానమంత్రి సహాయ నిధి (పీఎం రిలీఫ్ ఫండ్)కి మళ్లించాలని సూచించారు. సోనియా సూచనలు మోదీ పాటిస్తారా లేదా అన్న విషయాలను పక్కన పెడితే మీడియా యాజమాన్యాలు కాంగ్రెస్ అధినేత్రి సూచనలపై గుర్రుగా ఉండే అవకాశం లేకపోలేదు. ఇకపోతే సోనియా మరో నాలుగు సూచనలు చేశారు. అవేమిటయ్యా అంటే…!
20 వేల కోట్ల రూపాయల సెంట్రల్ విస్టా బ్యూటిఫికేషన్తో పాటు తదితర ప్రాజెక్టుల పనులను నిలిపివేసి ఆ నిధుల్ని కూడా పీఎం రిలీఫ్ ఫండ్కు మళ్లించాలని సోనియా విజ్ఞప్తి చేశారు. బడ్జెట్ వ్యయంలో 30 శాతం కోత విధించమని సలహా ఇచ్చారు. అన్ని రకాల విదేశీ యాత్రలను రద్దు చేసుకోమని చెప్పారు. పీఎం కేర్స్కు వచ్చిన నిధులని పీఎం రిలీఫ్ ఫండ్కు మళ్లించమని సోనియా సూచించారు.