న్యూఢిల్లీః ఆర్థికమాంద్యం నుంచి బయటపడేందుకు కేంద్ర ప్రభుత్వానికి సుమారు 1.76 లక్షల కోట్లు నిధులు బదిలీ చేసేందుకు ఆర్బీఐ నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో మోదీ సర్కార్పై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ విమర్శలు గుప్పించారు. ప్రధాని, ఆర్థికమంత్రి స్వయంగా సృష్టించుకున్న ఆర్థిక విపత్తు నుంచి ఎలా బయటపడాలో వారికి తెలియట్లేదని అన్నారు. ఆర్బీఐ నుంచి డబ్బును లూటీ చేసినంత మాత్రాన సమస్యలు తీరవన్నారు. మందుల దుకాణం నుంచి బ్యాండ్ఎయిడ్ను దోచుకుని తుపాకీ గాయానికి వేసుకున్నట్లుగా వీరి చర్య ఉందని విమర్శించారు. ఈ మేరకు రాహుల్ ట్విట్ చేశారు.
PM & FM are clueless about how to solve their self created economic disaster.
Stealing from RBI won’t work – it’s like stealing a Band-Aid from the dispensary & sticking it on a gunshot wound. #RBILooted https://t.co/P7vEzWvTY3
— Rahul Gandhi (@RahulGandhi) August 27, 2019
కేంద్ర ప్రభుత్వానికి రూ.1.76 లక్షల కోట్ల విలువైన డివిడెండ్, మిగులు నిధులను బదిలీ చేయాలని భారత రిజర్వ్ బ్యాంక్ (ఆర్బీఐ) నిర్ణయించింది. మందగిస్తున్న ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టే ఉద్ధేశ్యంతో ఈమేరకు నిర్ణయం తీసుకున్నట్లుగా ఆర్బీఐ ప్రకటించింది. 2018-19 ఏడాదికి గాను మొత్తం రూ.1,76,051 కోట్లను బదిలీ చేయడానికి గవర్నర్ శక్తికాంత దాస్ నేతృత్వంలోని ఆర్బీఐ కేంద్ర బోర్డు అనుమతి తెలిపింది. ఇందులో రూ.1,23,414 కోట్ల డివిడెండ్ రూపంలో ఇవ్వనున్న ఆర్బీఐ.. ఎకనామిక్ క్యాపిటల్ ఫ్రేమ్వర్క్(ఈసీఎఫ్) కింద రూ. 52, 637 కోట్లు బదిలీ చేయనుంది. ఇప్పటికే రూ.28,000 కోట్ల మధ్యంతర డివిడెండ్ను కేంద్రానికి ఆర్బీఐ సమర్పించింది. ఈ క్రమంలో మిగతా మొత్తాన్నీ త్వరలోనే అప్పగించనున్నది.