శ్రీనగర్: జమ్మూకశ్మీర్కు స్వయం ప్రతిపత్తి కల్పించే ఆర్టికల్ 370ని కేంద్రం ప్రభుత్వం ఆగస్ట్ 5న రద్దు చేసిన సంగతి తెలిసిందే. అయితే, దీనిని వ్యతిరేకించిన కొంత మంది స్కూల్ విద్యార్థులు..తమ పాఠశాలని ఓ ఉపాధ్యాయుడిపై దాడికి పాల్పడ్డారు. ఈ ఘటన కశ్మీర్ లోని రాంబన్ జిల్లాలో చోటుచేసుకుంది. ఈ మేరకు ఇండియన్ ఎక్స్ ప్రెస్ ఓ కథనాన్ని రాసింది. శుక్రవారం స్కూల్లో పాఠాలు చెబుతున్న సందర్భంగా.. జమ్మూకశ్మీర్ను రెండు రాష్ట్రాలుగా కేంద్రం విభజించడం మంచిదని స్కూల్ టిచర్ అన్నారు. దీంతో కలిగే ప్రయోజనాలను విద్యార్థులకు వివరించారు. అయితే సోమవారం స్కూల్లో క్లాస్ జరుగుతుండగా..కొంతమంది విద్యార్థులు అడ్డుకుని, టీచర్ పై దాడి చేశారు. అంతేకాదు మంగళవారం క్లాసులను బహిష్కరించి..స్కూల్ టీచర్ పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అయితే, టీచర్ సెలవులో ఉన్నారని, స్కూలుకు రాలేదని ప్రిన్సిపాల్ విద్యార్థులకు సర్ది చెప్పారు.
మరోవైపు స్కూల్ లో ఆర్టికల్ 370పై విద్యార్థులు అడిగిన ప్రశ్నలకు తాను సమాధానాలు ఇచ్చానని బాధిత టీచర్ తెలిపారు. ఈ సందర్భంగా కొంత మంది విద్యార్థులు తనపై దాడి చేశారని చెప్పారు. దాడితో తనకు తీవ్ర గాయమైందన్నారు. అనంతరం పోలీసులు వచ్చి తనను ఆస్పత్రికి తీసుకెళ్లారని చెప్పారు. ఆస్పత్రిలో 24 గంటల పాటు వైద్యుల పర్యవేక్షలో ఉన్నానని వివరించారు. ఈ ఘటనపై దర్యాప్తు చేస్తున్నట్లు రాంబన్ డిప్యూటీ కమిషనర్ నజీమ్ జై ఖాన్ తెలిపారు. ఘటనకు సంబంధించి సమగ్ర విచారణ కోసం ఎస్పీతో కూడిన ఓ కమిటీని వేసినట్లు వెల్లడించారు. కాగా, ఆర్టికల్ 370 రద్దు సందర్భంగా విధించిన 144 సెక్షన్ ను వారం రోజుల క్రితం ఎత్తివేశారు.