(న్యూస్ ఆర్బిట్ బ్యూరో)
న్యూఢిల్లీ ఉద్యోగ నియామకాల్లో, పదోన్నతుల్లో రిజర్వేషన్లు ప్రాధమిక హక్కేమీ కాదని సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు రాజకీయంగా పెను దుమారం సృష్టించింది. అన్ని రాజకీయ పార్టీలూ ఈ తీర్పు అన్యాయమైనదని వ్యాఖ్యానించాయి. అయితే తీర్పుకు బాధ్యత ఎవరిదన్న విషయంలో ఆరోపణలు ప్రత్యారోపణలు మొదలయ్యాయి.
సుప్రీంకోర్టు తీర్పు విషయం సోమవారం లోక్సభలో తీవ్ర గందరగోళం సృష్టించింది. తీర్పుతో తమ ప్రభుత్వానికి సంబంధం లేదని బిజెపి వాదించింది. బిజెపి, దాని సైద్ధాంతిక గురువు ఆరెస్సెస్ ప్రాధమికంగా రిజర్వేషన్లకు వ్యతిరేకమని కాంగ్రెస్ వ్యాఖ్యానించింది. గందరగోళం నడుమ లోక్సభ వాయిదా పడింది.
సుప్ర్రీంకోర్టు తీర్పులో తమ ప్రమేయం లేదని సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి తావర్ చంద్ గెహ్లాట్ పేర్కొన్నారు. తీర్పు ఇచ్చే ముందు కోర్టు ప్రభుత్వం అభిప్రాయాలు అడగలేదని ఆయన చెప్పారు. పదోన్నతుల్లో రిజర్వేషన్లు పాటించకూడదని 2012లో ఉత్తరాఖండ్లోని కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై ఈ తీర్పు వచ్చిందని ఆయన అన్నారు. విషయం పరిశీలిస్తున్నామనీ, తగిన నిర్ణయం తీసుకుంటామనీ మంత్రి పేర్కొన్నారు.