(న్యూస్ ఆర్బిట్ బ్యూరో)
అమరావతి: తనను పదే పదే పప్పు అంటున్న వారు జగన్యే గన్నేరు పప్పు అని తెలుసుకోవాలని టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ విమర్శించారు. బుధవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో సిఎం జగన్ వివిధ సందర్భాలలో తప్పుగా మాట్లాడిన మాటలను, అందులో అర్ధాలు వివరిస్తూ ఓ వీడియోను విడుదల చేశారు. అనంతరం లోకేష్ మాట్లాడుతూ ఇవీ జగన్కు వచ్చిన లెక్కలు అని అన్నారు. ఎదుటి వారిని హేళన చేయడం కాదు, వారు అవహేళన కాకుండా మాట్లాడటం తెలుసుకోవాలని లోకేష్ అన్నారు. తెలుగు, లెక్కల్లో, ఇంగ్లీషు లో కూడా అన్నీ తప్పులే మాట్లాడిన విషయాన్ని లోకేష్ గుర్తు చేస్తూ వైకాపా పేటియం బ్యాచ్, వైసిపి ప్రజా ప్రతినిధులు ఇది చూసి ఏమంటారని ప్రశ్నించారు.
తాను అసెంబ్లీలో లేకున్నా అందరూ చంద్రబాబు తర్వాత నా పేరు పెట్టి విమర్శలు చేశారని అన్నారు. ఒకటికి పది సార్లు తన పేరు ఉచ్చరిస్తూ తిట్టినా స్పీకర్ ఏమీ అనలేదని లోకేష్ పేర్కొన్నారు.తాను అమెరికాలో స్టాండ ఫర్డ్ యూనివర్శిటీలో చదివాననీ, తెలుగులో చిన్న చిన్న తప్పులను మాట్లాడి ఉండవచ్చుననీ లోకేష్ ఒప్పుకుంటూ తాను వర్ధంతిని జయంతి అంటే రాష్ట్ర అభివృద్ధి ఆగిపోయిందా అని ప్రశ్నించారు.మంగళగిరి నియోజకవర్గంలో 1985 తర్వాత టిడిపి గెలవలేదు అయినా చరిత్ర సృష్టిద్దామని ప్రయత్నం చేసి విఫలమయ్యామని లోకేష్ అన్నారు.
ఫ్యూచర్ గ్రూపులో పెరిగిన ధరలపై తమకు ఆపాదిస్తున్న మంత్రి బుగ్గన వారికి షేర్లు ఉన్న సంస్థలలో ధరలు పెరిగితే బాధ్యత వహిస్తారా అని ఆయన ప్రశ్నించారు. షేర్లను పట్టుకుని తప్పు చేసినట్లుగా నిందలు మోపుతారా అని మండిపడ్డారు.టిడిపిపై విమర్శలు మాని ప్రజల సమస్యలు పరిష్కారం కోసం దృష్టి పెట్టాలని వైసిపి ప్రభుత్వానికి లోకేష్ సూచించారు. అధికార పార్టీ ఎమ్మెల్యేనే నెల్లూరులో మాఫియా రాజ్యమేలుతోందని విమర్శించిన విషయాన్ని లోకేష్ గుర్తు చేశారు.
ఆరు నెలల్లో మంచి ముఖ్యమంత్రి అనిపించుకుంటానని ప్రకటించిన జగన్ రాష్ట్రాన్ని ముంచే ముఖ్యమంత్రి అనిపించుకున్నాడని విమర్శించారు. వైసిపి వారి కంటే ఎక్కువ మాట్లాడే అవకాశం ఉన్నా సంస్కారం అడ్డువస్తుందని లోకేష్ పేర్కొన్నారు. రాష్ట్రంలోనలభై శాతం ఓటింగ్ ఉన్న టిడిపిని ఎవరూ ఏమి చేయలేరని ఆయన ధీమా వ్యక్తం చేశారు.
Sri Nara Lokesh Addressing the Media – Live from NTR Bhavan, Amaravati. https://t.co/ams8nLqIur
— Telugu Desam Party (TDP Official) (@JaiTDP) December 11, 2019