అమరావతి: ముఖ్యమంత్రి, వైసిపి అధినేత వైఎస్ జగన్మోహన రెడ్డిపై టిడిపి నేత, ఎమ్మెల్సీ నారా లోకేష్ ట్విట్టర్ వేదికగా ప్రశ్నల వర్షం కురిపించారు. రావాలి సిబిఐ, కావాలి సిబిఐ అంటూ నాడు యాగి చేసిన వారు ఇప్పుడు సిబిఐ అంటే ఎందుకు భయపడుతున్నారని లోకేష్ ప్రశ్నించారు. బాబాయ్ హత్య కేసుని సిబిఐకి అప్పగించాలని డిమాండ్ చేసిన పెద్ద మనుషులు ఇప్పుడు వారే అధికారంలో ఉన్నా సిబిఐ వద్దు అని ఎందుకు అంటున్నారని లోకేష్ ప్రశ్నించారు. హత్య కేసులో అనుమానితుల ఆత్మహత్యల వెనుక రహస్యం ఏమిటి అని లోకేష్ ప్రశ్నించారు.
కోడికత్తి వెనుక మహాకుట్ర ఉంది, సిబిఐ విచారణ చేపట్టాలని టివిల్లో అరిచిన గ్యాంగ్ ఇప్పుడు ఎందుకు మౌనంగా ఉందని లోకేష్ ప్రశ్నించారు. నిందితుడు జైల్లోనే ప్రాణహాని ఉంది అనే పరిస్థితి ఎందుకు వచ్చిందన్నారు. సిబిఐకి కేసు అప్పగిస్తే నిజాలు బయటపడి జీవితాంతం శుక్రవారం కోర్టుకి వెళ్లాల్సి వస్తుందని భయమా అంటూ లోకేష్ ట్వీట్ చేశారు.
2018 అక్టోబర్ 25వ తేదీన విశాఖపట్నం ఎయిర్పోర్టు లాంజ్లో నాటి ప్రతిపక్ష నేత, నేటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డిపై జె శ్రీనివాసరావు అనే యువకుడు కోడికత్తితో దాడి చేశాడు. ఈ కేసు దర్యాప్తును నాటి చంద్రబాబు ప్రభుత్వం సిట్ ఏర్పాటు చేసింది. అయితే రాష్ట్ర ప్రభుత్వ దర్యాప్తు సంస్థపై తమకు నమ్మకం లేదనీ, ఈ హత్యాయత్నం కేసును జాతీయ దర్యాప్తు సంస్థతో విచారణ జరిపించాలని నాడు వైసిపి నేతలు డిమాండ్ చేశారు. వైసిపి నేతల పిటిషన్పై కోర్టు విచారణ జరిపి కేంద్ర దర్యాప్తు సంస్థతో విచారణకు ఆదేశాలు ఇవ్వడంతో ఎన్ఐఏకి కేసు బదిలీ అయ్యింది.
సార్వత్రిక ఎన్నికలకు ముందు ఈ ఏడాది మార్చి 14న వైఎస్ జగన్మోహనరెడ్డి బాబాయి మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డిని ఆయన ఇంట్లోనే గుర్తు తేలియని వ్యక్తులు దారుణంగా హత్య చేశారు. నాడు చంద్రబాబు ప్రభుత్వం ఈ కేసు దర్యాప్తునకు సిట్ను నియమించింది. వివేకా హత్య కేసులో టిడిపి హస్తం ఉందని నాడు వైసిపి నేతలు ఆరోపణలు చేశారు. సిబిఐతో విచారణ జరిపించాలని కూడా డిమాండ్ చేశారు. వివేకా హత్య కేసు వ్యవహారాన్ని పురస్కరించుకొని నాటి ఎన్నికల ప్రచార సభల్లో వైసిపి, టిడిపిలు పరస్పర ఆరోపణలు చేసుకుంటున్న నేపథ్యంలో కేసు పక్కదారి పడుతోందంటూ హతుడి కుమార్తె హైకోర్టును ఆశ్రయించగా రాజకీయ పార్టీలు ఈ అంశంపై మాట్లాడవద్దని కోర్టు ఆదేశించిన విషయం తెలిసిందే. ఈ కేసులో ఘటనా స్థలంలో సాక్షాలు రూపుమాపారన్న ఆరోపణపై ముగ్గురుని అరెస్టు చేశారు. అనంతరం వారు బెయిల్పై విడుదల అయ్యారు. వైఎస్ జగన్మోహనరెడ్డి నేతృత్వంలో వైసిపి ప్రభుత్వం ఏర్పడిన తరువాత పాత సిట్ను రద్దు చేసి నూతన అధికారులతో మరో సిట్ ఏర్పాటు చేశారు. ఈ కేసులో వందలాది మందిని పోలీసులు విచారణ జరిపినా ఇంత వరకూ అసలైన దోషులను పట్టుకోలేదు. పలువురు అనుమానితులకు నార్కొ టెస్ట్లు సైతం నిర్వహించారు.