కలిసిపోయిన లాలూ కొడుకులు
ఘనంగా తేజ్ ప్రతాప్ పుట్టినరోజు
అన్న ఆశీస్సులు కావాలన్న తేజస్వి
పట్నా: బిహారీ యాదవ సోదరులు మళ్లీ కలిసిపోయారు. కొట్టుకోవడం, కలిసిపోవడం వారికి తరచు మామూలే. అన్నగారైన తేజ్ ప్రతాప్ పుట్టినరోజును తమ్ముడు తేజస్వి వైభవంగా చేయడంతో ఈ కలయిక అధికారికంగా వెల్లడైంది. తామిద్దరి మధ్య ఎప్పుడూ ఎలాంటి గొడవలు లేవని తేజస్వి అన్నాడు. లాలూ జైల్లో ఉండటంతో పార్టీ వ్యవహారాలన్నీ తమ్ముడైన తేజస్వియే చూసుకుంటున్నాడు. అన్నగారి పుట్టినరోజు సందర్భంగా చిన్న పార్టీ పెట్టుకున్నామని, తామిద్దరం కలిసి మతతత్వ శక్తులపై లాలూజీ పోరాటాన్ని ముందుకు తీసుకెళ్తామని అన్నాడు.
ఆర్జేడీ తరఫున ఎంపిక చేసిన అభ్యర్థుల విషయంలో తీవ్ర అసంతృప్తికి గురైన తేజ్ ప్రతాప్ యాదవ్ (30) కొన్నాళ్ల క్రితం ఇంటి నుంచి వెళ్లిపోయాడు. అంతకుముందే అతడికి తన భార్యతో గొడవలు వచ్చాయి. ఆమె నుంచి విడాకులు కోరుతూ కోర్టుకెక్కాడు. తన మాజీ మామ చంద్రికా రాయ్ సరణ్ నియోజకవర్గం నుంచి ఆర్జేడీ తరఫున పోటీ చేయడం కూడా అతడి ఆగ్రహానికి కారణమైంది. అక్కడ లాలూ నాలుగుసార్లు ఎంపీగా గెలిచారు. దాంతో ఆ సీటును కుటుంబంలో వేరే ఎవరికైనా ఇవ్వాలని తేజ్ ప్రతాప్ డిమాండ్ చేశాడు.
కొన్ని సంఘటనలు జరిగిన తర్వాత, యాదవ్ సోదరుల తల్లి రబ్రీదేవి తన పెద్ద కుమారుడిని ఇక ఇంటికి వచ్చేయాలని కోరారు. జరిగింది చాలు.. ఇక ఇంటికి రా కన్నా అని పిలిచారు. దాంతో పుట్టినరోజు సందర్భంగా అన్నదమ్ములు మళ్లీ కలిసిపోయారు. పసుపచ్చ రంగు థీమ్ పెట్టుకుని అదే రంగు కేక్ కట్ చేసి, తెలుపు, పసుపు బెలూన్లను ఎగరేశారు. అయితే అన్నగారికి ఏం బహుమతి ఇచ్చానన్నది మాత్రం అత్యంత రహస్యమని తేజస్వి అన్నాడు. కృష్ణార్జునులు ఇద్దరూ కలిసిపోయామని ఈ సందర్భంగా అన్నాడు.
Wishing a very Happy Birthday to my “Krishna” elder brother @TejYadav14 Bhai, one of the sweetest person I’ve ever known.” Wishing abundant happiness, love and life! pic.twitter.com/jC5HKuF4Ib
— Tejashwi Yadav (@yadavtejashwi) April 16, 2019