(న్యూస్ ఆర్బిట్ డెస్క్)
ప్రతిపక్షాలతో కలిసి ప్రభుత్వాన్ని కష్టాల్లోకి నెట్టేందుకు యూనియన్ నేతలు పని కట్టుకుని సమ్మె బాట పట్టారని ఆర్టీసీ ఇన్చార్జ్ ఎండీ సునీల్శర్మ హైకోర్టుకు సమర్పించిన అఫిడవిట్లో పేర్కొనడం ప్రభుత్వానికి బెడిసి కొడుతుందా ? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. ఆర్టీసీ ఎండీ దాఖలు చేసిన అఫిడవిట్ పై తెలంగాణలోని విపక్ష పార్టీలు భగ్గుమన్నాయి. కార్మికులు చేపట్టిన సమ్మెకు రాజకీయ పక్షాలు మద్దతు పలకడంతో దీనికి రాజకీయ రంగు పులుముకుంది. ప్రభుత్వంపై కుట్రపూరితంగా వ్యవహరించేందుకు జేఏసీ నేతలు ప్రతిపక్షాలతో చేతులు కలిపారని ఆర్టీసీ ఎండీ, ఐఏఎస్ అయిన వ్యక్తి ఆరోపించడం తీవ్ర దుమారం రేపుతోంది. ఇప్పటికే కేసీఆర్ తీరుపై అన్ని విపక్ష పార్టీలు విమర్శలు గుప్పిస్తున్నాయి. తాజాగా ఆర్టీసీ ఎండీ అఫిడవిట్ తో వివాదం మరింత ముదిరింది. ప్రభుత్వ తీరుపై విపక్షాలు ఏకం కావాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. అంతేకాదు ఈ అంశాన్ని పార్లమెంట్ లోనూ చర్చించేలా తెలంగాణ బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు ప్రణాళిక రచిస్తున్నాయి.
ఈ అంశమై తెలంగాణ కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా స్పందించింది. ఆర్టీసీ ఎండీ దాఖలు చేసిన అఫిడవిట్ ను సుమోటోగా స్వీకరించాలని, రాజకీయ పార్టీల మీద చేసిన ఆరోపణలను సీరియస్ గా తీసుకోవాలని పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమారెడ్డి హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిని కోరారు. ప్రభుత్వాన్ని కూల్చాలని చూస్తే తమపై కేసు పెట్టాలని, సునీల్ శర్మ ఎవరి ప్రోద్బలంతో ఇలాంటి అఫిడవిట్ వేశారంటూ ప్రశ్నించారు. అటు ఆర్టీసీ కార్మికుల సమ్మెపై కేంద్ర ప్రభుత్వం సరైన సమయంలో స్పందిస్తుందని రాష్ట్ర బీజేపీ నాయకత్వం చెబుతోంది. సమ్మెపై కేంద్రానికి ఎప్పటికప్పుడు నివేదికలు పంపిస్తోంది. తాజాగా ఆర్టీసీ ఎండీ దాఖలు చేసిన అఫిడవిట్ లోని అంశాలను కూడా రాష్ట్ర నేతలు బీజేపీ పెద్దలకు సమాచారం అందించినట్లు తెలుస్తోంది. తెలంగాణలో మంచి ఛాన్స్ కోసం ఎదురు చూస్తున్న బీజేపీకి.. ఆర్టీసీ సమ్మె రాజకీయంగా కలిసొచ్చే అవకాశం ఉంది.
ఇప్పటికే ఆర్టీసీ డ్రైవర్ నగునూరి బాబు అంతిమయాత్ర సందర్భంగా.. కరీంగనర్ ఎంపీ బండి సంజయ్ విషయంలో పోలీసుల ఓవరాక్షన్పై బీజేపీ పెద్దలు ఆరా తీశారు. సీఎం కేసీఆర్ వైఖరిపై కేంద్రం సీరియస్ గా ఉన్నట్లు వార్తలు కూడా వినిపిస్తున్నాయి. పోలీసులు తనపై దాడి చేశారని కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ లోక్ సభ స్పీకర్ ఓం బిర్లాకు కూడా ఫిర్యాదు చేశారు. పార్లమెంట్ సమావేశాల సందర్భంగా ఈ అంశాన్ని లెవనెత్తే అవకాశముంది. ఈ నేపథ్యంలో కేసీఆర్ సర్కార్ కు ఇబ్బందులు తప్పవని తెలుస్తోంది. ఇక సోమవారం(నవంబర్ 18) ఆర్టీసీ ఎండీ సమర్పించిన అఫిడవిట్ పై హైకోర్టులో వాదనలు జరగనున్నాయి.
ఇటీవల ఆర్టీసీ సమ్మెపై ఐఎఎస్ అధికారులు ఇచ్చిన వివరణపై తెలంగాణ హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఉద్దేశ్యపూర్వకంగా తప్పుడు నివేదికలు ఇస్తే కోర్టు ధిక్కారం కిందకే వస్తోందని హెచ్చరించింది. తమను తప్పుదోవ పట్టించిన ఆర్టీసీ ఇన్చార్జి ఎండీని మంత్రి ఎందుకు కొనసాగిస్తున్నారో అర్థం కావడం లేదంటూ చీఫ్ జస్టిస్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో తాజాగా ఆర్టీసీ ఎండీ దాఖలు చేసిన అఫిడవిట్ పై హైకోర్టు ఎలా స్పందిస్తుంది ? అనేది ఆసక్తికరంగా మారింది.