(న్యూస్ ఆర్బిట్ డెస్క్)
కర్నూలులో హైకోర్టు ఏర్పాటును బీజేపీ ఎంపీ టీజీ వెంకటేష్ స్వాగతించారు. ఏపీకి మూడు రాజధానులు ఉండే అవకాశం ఉందని గతంలో బీజేపీ టీజీ వెంకటేష్ వ్యాఖ్యలు నిజం అయ్యేలా మంగళవారం ఏపీ అసెంబ్లీలో సీఎం వైఎస్ జగన్ ప్రకటన చేశారు. మొదటి నుంచి కూడా రాయలసీమ వాణిని టీజీ వెంకటేష్ బలంగా వినిపిస్తున్నారు. తాజాగా హైకోర్టు అంశమై సీఎం జగన్ నిర్ణయంపై సంతోషం వ్యక్తం చేశారు. అభివృద్ధి వికేంద్రీకరణ కోసం జగన్ చేస్తున్న ప్రయత్నాలు మంచి ఫలితాలనిస్తాయన్నారు. అయితే కర్నూలులో హైకోర్టు మాత్రమే కాకుండా అసెంబ్లీ, సచివాలయం కూడా ఏర్పాటు చేస్తేనే రాజధానిగా అర్థం ఉంటుందన్నారు. అదేవిధంగా అమరావతి, వైజాగ్లో హైకోర్టు బెంచ్ ఏర్పాటు చేయాలని ఆయన సూచించారు.
రాజధాని వికేంద్రీకరణ చేస్తేనే అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందుతాయన్న అభిప్రాయాన్ని టీజీ వ్యక్తం చేశారు. రాజధానుల అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం నిధులు విడుదల చేస్తుందని ఆయన పేర్కొన్నారు. అడ్మినిస్ట్రేటివ్, హైకోర్టు, అసెంబ్లీ మూడు చోట్ల కాకుండా ఒకే చోట ఉంటే అభివృద్ధి చెందడానికి అవకాశం ఉంటుందన్నారు. రాయలసీమ నుంచి అమరావతికి వెళ్లడమే కష్టమైనప్పుడు మళ్లీ వైజాగ్ కు వెళ్లడం అయ్యే పనికాదన్నారు. కర్నూలులో కేవలం హైకోర్టు ఏర్పాటు చేయడంతో ఒక శాతం ఉద్యోగులు, కొంతమంది ప్రజలకు లాభం చేకూరుతుందన్నారు. అసెంబ్లీ కూడా కర్నూలులో ఉంటే మంత్రులు, ఎమ్మెల్యేలు వచ్చి పోతుంటారని చెప్పారు. అభివృద్ధి జరిగేందుకు వీలుంటుందన్నారు. కర్నూలులో సమ్మర్ కేపిటల్, వైజాగ్ లో వింటర్ కేపిటల్ పెట్టాలని సూచించారు. ప్రభుత్వం తమ అభిప్రాయాలు కూడా తీసుకోవాలని..ఓవర్ నైట్ నిర్ణయాలతో ఇబ్బందులొస్తాయన్నారు.
అభివృద్ధి ఒకే ప్రాంతానికి పరిమితం కారాదని, వికేంద్రీకరణ జరగాలని అందుకే ఏపీకి మూడు రాజధానులు అవసరముందని సీఎం జగన్ మోహన్ రెడ్డి మంగళవారం అసెంబ్లీలో వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. దక్షిణాఫ్రికా లాంటి దేశాలలో మూడు రాజధానులు ఉన్నాయని, మనం కూడా మారాలి అని, మన రాష్ట్రానికి కూడా మూడు రాజధానులు రావచ్చు అని సీఎం జగన్ పేర్కొన్నారు. నిపుణుల కమిటీ నివేదిక అందిన వెంటనే రాజధాని పై నిర్ణయం తీసుకుంటామని జగన్ చెప్పారు.