న్యూస్ ఆర్బిట్ డెస్క్
సార్వత్రిక ఎన్నికల మూడవ దశ పోలింగ్లో కూడా ఇవిఎంలతో తిప్పలు తప్పడం లేదు. ఉత్తరప్రదేశ్లోని ఫిరోజాబాద్, బరేలీ, వోన్లా నియోజకవర్గాలలోని కొన్ని పోలింగ్ కేంద్రాలలో ఇవిఎంలు మొరాయించినట్లు వార్తలు వచ్చాయి. కొన్ని చోట్ల వోటింగ్ యంత్రాలు చాలా నెమ్మదిగా పని చేస్తున్నాయని వోటర్లు ఫిర్యాదు చేశారు. ఫిరోజాబాద్ నియోజకవర్గంలోని ఒక బూత్లో వివిప్యాట్ యంత్రం పనిచేయలేదు.
మంగళవారం 13 రాష్ట్రాలలో, రెండు కేంద్రపాలిత ప్రాంతాలలో మొత్తం 117 నియోజకవర్గాలలో పోలింగ్ మొదలయింది. మొత్తం ఏడు దశల్లోనూ ఎక్కువ సీట్లలో పోలింగ్ జరిగేది ఈ రోజునే. గుజరాత్లోని మొత్తం 26 సీట్లకూ, కేరళలోని మొత్తం 20 సీట్లకూ పోలింగ్ జరుగుతోంది. కర్నాటకలో మిగిలిన 14 సీట్లకు కూడా ఈ రోజు పోలింగ్ జరుగుతోంది. దీనితో దక్షిణ బారతదేశంలో పోలింగ్ పూర్తవుతుంది.
కేరళలో కూడా పలు చోట్ల ఇవిఎంలు మొరాయించాయి. బీహార్లోని సుపౌల్ నియోజకవర్గంలో ఒకచోట పని చేయని ఇవిఎంను మార్చాల్సివచ్చింది.