Photo courtesy: Indian Express
పెద్దవాళ్లతో గొడవ పెట్టుకోవద్దని, సుప్రీంకోర్టు ఉద్యోగులపై మోసం చేశారంటూ కేసు పెట్టడం అనవసరమని తన కొడుక్కు పదే పదే చెప్పానని హర్యానాకు చెందిన ఒక తల్లి వాపోతోంది. సెక్యూరిటీ గార్డుగా పనిచేసే తన కొడుకు నవీన్ కుమార్ తో ఆమె, ఆమె కుటుంబ సభ్యులు చివరిసారిగా మాట్లాడినది గత శనివారమే. ఆరోజే సుప్రీంకోర్టు ఉద్యోగిని ఒకరు మొత్తం జడ్జీలందరికీ సీజేఐ జస్టిస్ గొగోయ్ మీద ఫిర్యాదు చేసింది. తనమీద తిలక్ మార్గ్ పోలీసు స్టేషనులో తప్పుడు కేసు పెట్టారని ఆమె ఆరోపించింది. అయితే, ఆ మహిళ మీద కేసు పెట్టింది ఎవరో కాదు.. సెక్యూరిటీ గార్డు నవీన్ కుమార్. తనకు సుప్రీంకోర్టులో ఉద్యోగం ఇప్పిస్తానని చెప్పి ఆమె తనవద్ద రూ. 50వేలు తీసుకుందని అతడు కేసు పెట్టాడు. ఆమె మీద కేసు నమోదైంది. ఆమెకు మంజూరైన బెయిల్ రద్దు చేయాలంటూ ఢిల్లీ పోలీసులు ఏప్రిల్ 20న పటియాలా హౌస్ కోర్టుకు వెళ్లారు. బాధితుడికి బెదిరింపులు వస్తున్నాయని వారు చెప్పారు. కేసు ఏప్రిల్ 24కు వాయిదా పడింది.
తన కొడుకు ఏప్రిల్ 20వ తేదీ ఉదయం 7 గంటలకు ఇంటి నుంచి చండీగఢ్ బయల్దేరాడని, అప్పటినుంచి అతడి ఫోన్ కూడా స్విచాఫ్ చేసి ఉందని అతడి తల్లి మీనా (50) వాపోయారు. ఇండియన్ ఎక్స్ ప్రెస్ బృందం వారిని పలకరించింది. కేసు పెట్టవద్దని తాను అతడికి చెప్పానని, బలవంతులతో పోరాటం తగదని ఆమె అన్నారు. తన ప్రాణాలకు ప్రమాదముందని అతడు భయపడేవాడని, అన్నీ త్వరలోనే సర్దుకుంటాయని తనకు చెప్పాడని తెలిపారు. నవీన్కుమార్ ఝజ్జర్ లోని హెచ్ఎల్ సిటీ ప్రైవేట్ లిమిటెడ్ అనే కంపెనీలోనెలకు రూ. 15వేల జీతానికి పనిచేస్తాడు. అతడికి తగిన భద్రత కల్పించాల్సిందిగా తాము ఝజ్జర్ ఎస్పీకి లిఖిత పూర్వకంగా తెలిపినట్లు ఢిల్లీ క్రైంబ్రాంచి పోలీసులు తెలిపారు. తనకు బెదిరింపుకాల్స్ వస్తున్నాయని, కొంతమంది అనుసరిస్తున్నారని కూడా కుమార్ క్రైం బ్రాంచికి తెలిపాడు. అతడి మీద క్రిమినల్ రికార్డులు లేవని, చిన్న కేసులోనూ అతడి పేరు లేదని ఝజ్జర్ పోలీసులు చెప్పారు. అతడికి ఉద్యోగరీత్యా లైసెన్సుడు రైఫిల్ ఉందని ఎస్పీ అశోక్ కుమార్ అన్నారు. కొంతకాలం క్రితమే అతడికి పెళ్లయింది. కంపెనీ ఉన్నతాధికారులు ముఖ్యమైన పత్రాలు తీసుకెళ్లేటపుడు అతడినే సెక్యూరిటీగా తీసుకెళ్లేవారు.
ఈ మధ్య కాలంలో కుమార్ బాగా ఒత్తిడికి గురవుతున్నాడని, ఆ తర్వాతే అతడు సుప్రీంకోర్టులో పనిచేసే మహిళ మీద కేసు పెట్టినట్లు తమకు తెలిసిందని అతడి భార్య చెప్పారు. జీతం సరిపోవడం లేదని, మంచి ఉద్యోగం కోసం ప్రయత్నిస్తూ ఇంట్లోవాళ్లను డబ్బులు అడిగాడు. కొంత తన సొంత మదుపు ఉండగా మరికొంత వేరే బంధువుల వద్ద అప్పు తీసుకున్నాడు. డబ్బులిచ్చి నెలరోజులైనా ఉద్యోగం రాకపోవడంతో బాగా ఆందోళనకు గురయ్యాడు. ఆ డబ్బులు తర్వాతైనా సంపాదించుకోవచ్చని తల్లి మీనా తరచు చెప్పేవారు. మానసారామ్ (55) అనే వ్యక్తి తనకు ఆ మహిళను పరిచయం చేశాడని కూడా ఫిర్యాదులో నవీన్ చెప్పాడు. కొన్నాళ్ల తర్వాత మానసారామ్ తన ఇంటి పైనుంచి పడి గాయపడి మరణించాడు. భర్తలు వదిలేసిన మహిళలకు సంబంధించిన ఆస్తి వివాదాల కేసులు చూసేవాడని అతడి కొడుకు కిషన్ చెప్పాడు. అతడి కుటుంబ సభ్యులకు నవీన్ కేసు గురించి తెలియదు. వాళ్ల కుటుంబం కూడా అప్పుల్లో ఉంది.
కాగా, నవీన్ పెట్టినది తప్పుడు కేసని మహిళ తరఫు న్యాయవాది విజయ్ కౌశిక్ అన్నారు. ఆమెను పోలీసులు వేధిస్తున్నారని, ఆమె నవీన్ను గానీ, మానసారామ్ను గానీ ఎప్పుడూ కలవలేదని చెప్పారు. అలాగే ఎవరినీ బెదిరించలేదు కూడా అని తెలిపారు. పోలీసులు ప్రస్తుతం ఆ మహిళతో పాటు ఆమె భర్త నుంచి కూడా ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. వాళ్ల కంప్యూటర్ హార్డ్ డిస్కు, ఇంటివద్ద ఉన్న సీసీటీవీ కెమెరా ఫుటేజి సైతం తీసుకున్నారు. కేసును అన్ని కోణాల్లో విచారిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.