హైదరాబాద్: రాజ్యాంగంలోని సెక్యులర్, ప్రజాస్వామ్య స్ఫూర్తిని ఉల్లంఘించి పౌరసత్వ సవరణ చట్టాన్ని నిరసిస్తూ ప్రసిద్ధ రచయితలు, విద్యావేత్తలు, పత్రికా రచయితలు గురువారం ట్యాంక్ బండ్ మీద ఉన్న మఖ్దూమ్ మొహియుద్దీన్ విగ్రహం వద్ద మౌన ప్రదర్శన చేశారు. తెలంగాణ అభ్యుదయ రచయితల సంఘం, ఉర్దూ రచయితల సంఘం ఆధ్వర్యంలో ఈ నిరసన ప్రదర్శన నిర్వహించారు. ‘మతోన్మాదాన్ని తిప్పి తిప్పికొడదాం లౌకిక వాదాన్ని నిలబెడదాం’, ‘నిప్పుతోడ చెలగాటమాడితే ముప్పులు తిప్పలు తప్పవురా’, ‘రాజ్యాంగ స్ఫూర్తికి హాని సహించం’, ‘విద్యార్ధులపై హింస తక్షణమే ఆపండి’ అని ప్లెకార్డులు ప్రదర్శించారు.
అఫ్గానిస్థాన్, బంగ్లాదేశ్, పాకిస్థాన్ దేశాలలో పీడనకు గురవుతున్న హిందువులు, బౌద్ధులు, సిక్కులు, జైనులు, పారశీలు, క్రైస్తవులకు మాత్రమే పౌరసత్వం ఇచ్చి కేవలం ముస్లింలను మినహాయించడాన్ని రచయితలు, విద్యావేత్తలు, పత్రికా రచయితలు నిరసించారు. జామియా మిలియా, అలీగఢ్ ముస్లిం యూనివర్సిటీ, ఇతరచోట్ల పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా నిరసన తెలియజేస్తున్న విద్యార్థులపై పోలీసులు విరుచుకపడటాన్ని వీరు తీవ్రంగా ఖండించారు.
పౌరసత్వ సవరణ చట్టంపై నిరసన తెలియజేయడాన్ని హైదరాబాద్ పోలీసు కమిషనర్ నిషేధించడాన్ని, అసమ్మతిని వ్యక్తంచేయడాన్ని అభ్యుదయ రచయితల సంఘం ఖండించింది. అసమ్మతి, నిరసన రాజ్యాంగం హామీ ఇచ్చిన అంశాలని గుర్తుచేసింది. ఈ నిషేధాజ్ఞలను తక్షణం ఎత్తివేయాలని, శాంతియుత ప్రదర్శనలకు అవకాశం కల్పించాలని అభ్యుదయ రచయితల సంఘం అధ్యక్షుడు ఆర్వి. రామారావు ఒక ప్రకటనలో విజ్ఞప్తి చేశారు.
previous post