న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్లోని వైసిపి ప్రభుత్వానికి ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా షాక్ ఇచ్చింది. మీడియా కథనాలపై ఆంక్షలు విధిస్తూ ఏపి ప్రభుత్వం జారీ చేసిన జిఓ నెంబర్ 2430 ను రద్దు చేయాలని కౌన్సిల్ ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఈ జివోను రద్దు చేయాలని జర్నలిస్ట్ సంఘాలు నిరసనలు వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. వివిధ రాజకీయ పక్షాలు ప్రభుత్వ చర్యలను తప్పుబట్టినా ప్రభుత్వం తమ వాదనకే కట్టుబడి ఉండి జివోను సమర్థించుకున్నది.
ఈ నేపథ్యంలో ప్రభుత్వం జారీ చేసిన జీవోపై ప్రెస్ కౌన్సిల్ ఛైర్మన్ జస్టిస్ సీకే ప్రసాద్ అధ్యక్షతన ఉత్తర్ప్రదేశ్లోని అలహాబాద్లో విచారణ జరిగింది. ఏపియుడబ్ల్యుజె తరపున సురేష్ తదితరులు హజరై జీవోకు వ్యతిరేకంగా తమ వాదనలు వినిపించారు. తప్పుడు వార్తలపై చర్యలు తీసుకోవడానికి ప్రత్యేక చట్టం తీసుకురావాల్సిన అవసరం లేదనీ, ఈ జివో వల్ల వార్త మంచిదా? చెడ్డదా? అని చూడకుండా ఎడాపెడా కేసులు పెట్టే ప్రమాదం ఉందనీ వారు ఆందోళన వెలిబుచ్చారు. పాత్రికేయుల్ని భయభ్రాంతులకు గురిచేసేలా జీవో ఉందని పేర్కొన్నారు. గతంలో తమిళనాడులో జయలలిత ప్రభుత్వ హయాంలో కేసుల నమోదును ఈ సందర్భంగా ఉదహరించారు.
ఈ విచారణకు ప్రభుత్వం నుండి సమాచార, పౌర సంబంధాల శాఖ అదనపు డైరెక్టర్ కిరణ్ హజరై తమ వాదనను వినిపించారు. జీవోను దుర్వినియోగం చేయమని చెప్పారు. కేవలం దురుద్దేశ పూర్వకంగా రాసే వార్తల నియంత్రణ కోసమే ఈ జీవో తెచ్చామన్నారు. ఏ మీడియా సంస్థను ఉద్దేశించి తెచ్చిన జీవో కాదని ప్రభుత్వం తరపున వివరణ ఇచ్చారు.
జర్నలిస్టు సంఘాలు, ప్రభుత్వం వాదనల అనంతరం ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా చైర్మన్ జస్టిస్ సికె ప్రసాద్ జీవో 2430 ను తక్షణం ఏపి ప్రభుత్వం ఉప సంహరించుకోవాలని ఆదేశించారు. దీనిపై ప్రభుత్వం ఏరకంగా స్పందిస్తుందో వేచి చూడాలి.