(న్యూస్ ఆర్బిట్ డెస్క్)
ఆర్టీసీ సమ్మె కొనసాగుతున్న వేళ.. కార్మికులు ఆత్మహత్యలకు పాల్పడటం కలకలం రేపుతోంది. ఆర్టీసీ కార్మికుల సమ్మె గురువారానికి 41వ రోజుకు చేరింది. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసి తమ డిమాండ్లను నెరవేర్చాలని కార్మికులు సమ్మెను కొనసాగిస్తున్నారు. రోజులు తరబడి సమ్మె చేస్తున్న ప్రభుత్వం స్పందిచడం లేదు. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసేది లేదని భీష్మించుకొని కూర్చుంది. దీంతో ఆర్టీసీ కార్మికులు తమ భవిష్యత్తుపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కుటుంబ పోషణ భారంగా మారిపోయింది. మనోవేదనకు గురై గుండెపోటుతో కొంతమంది మృతి చెందితే మరికొంతమంది ఆత్మ బలిదానాలు చేసకుంటున్నారు.
నారాయణఖేడ్ డిపోకి చెందిన ఆర్టీసీ కండక్టర్ నాగేశ్వర్ గురువారం ఉదయం ఆందోల్ మండలం జోగిపేటలో కన్నుమూశాడు. ఆర్టీసీ సమ్మె నేపథ్యంలో కొంతకాలంగా నాగేశ్వర్ తీవ్ర ఆందోళనతో ఉంటున్నాడు. సీఎం కేసీఆర్ కార్మికులకు డెడ్లైన్ విధించడం ఆయన్ను మరింత కలచివేసింది. ఈ నెల 5వ తేదీతో ప్రభుత్వం విధించిన డెడ్లైన్ పూర్తవడంతో అప్పటి నుంచి మానసికంగా మరింత ఆందోళనకు గురయ్యాడు. సమ్మె కారణంగా జీతం డబ్బులు రాకపోవడంతో కుటుంబాన్ని పోషించడం కష్టంగా మారింది. భవిష్యత్ గురించి తీవ్రంగా కలత చెందిన నాగేశ్వర్.. మతిస్థిమితం కోల్పోయి పిచ్చిగా ప్రవర్తించడం మొదలుపెట్టాడు. నాగేశ్వర్ ప్రవర్తనతో ఆవేదన చెందిన అతని భార్య అతన్ని తార్నాక ఆర్టీసీ ఆస్పత్రికి తీసుకెళ్లగా.. అక్కడ చికిత్సకు నిరాకరించారు. దీంతో చేసేది లేక తిరిగి వెళ్లిపోయారు. అద్దె ఇంట్లో యజమానుల ఒత్తిడి కారణంగా భర్త, ఇద్దరు పిల్లలను తీసుకుని ఆమె తన పుట్టింటికి వెళ్లారు. నాగేశ్వర్కి చికిత్స అందిస్తున్న క్రమంలో గురువారం తెల్లవారుజామున అతను కన్నుమూశాడు.
మరోవైపు మహబూబాబాద్ జిల్లా తొర్రూర్ ఆర్టీసీ డిపోకు చెందిన శ్రామిక్ కార్మికుడు మేకల అశోక్ పురుగుల మందు తాగి ఆత్మహత్య యత్నం చేశాడు. దీంతో భయాందోళనకు గురైన కుటుంబసభ్యులు అశోక్ ను అత్యవసర చికిత్స కోసం ఆస్పత్రికి తరలించారు. మహబూబాబాద్ ఆర్టీసీ డిపోలో డ్రైవర్గా పని చేస్తున్న ఆవుల నరేష్ పురుగుల మందు తాగి బుధవారం బలవన్మరణానికి పాల్పడ్డాడు. సమ్మెపై హైకోర్టు ఎటూ తేల్చకపోవడం, రెండు నెలలుగా జీతాలు రాకపోవడంతో తీవ్ర మనస్తాపం చెందిన నరేష్ పురుగులు మందుతాగి ఆత్మహత్య చేసుకున్నాడు.
ఇంతమంది చనిపోతున్నా రాష్ట్ర ప్రభుత్వానికి కనువిప్పుకలగడం లేదని ఆర్టీసీ జేఏసీ నేతలు మండిపడుతున్నారు. కార్మికుల సమ్మె కొనసాగుతున్నా.. ప్రభుత్వం నుంచి స్పందన రాలేదు. ఆర్టీసీని ప్రైవేటీకరణ చేసేందుకు ఇప్పటికే ప్రణాళికను కూడా సిద్ధం చేసింది. గత రెండు నెలలుగా కార్మికులకు జీతాలు లేవు. సుదీర్ఘంగా సమ్మె కొనసాగుతుండడం పట్ల కార్మిక కుటుంబాల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. ప్రభుత్వం సమ్మెను పరిష్కరించే దిశగా చర్యలు తీసుకోకపోవడంపై ఆవేదన చెందుతున్నారు. ఆర్టీసీ కార్మికులు న్యాయమైన డిమాండ్ల కోసం గత 40 రోజుల నుంచి సమ్మె చేస్తున్నా.. రోజులు తరబడి ఆర్టీసీపై సమీక్షిస్తున్న ముఖ్యమంత్రి కార్మిక సంఘాలను చర్చలకు ఎందుకు పిలవడం లేదని జేఏసీ నేతలు ప్రశ్నిస్తున్నారు. సీఎం ఆర్టీసీని రక్షించాల్సింది పోయి అణిచి వేయాలని చూస్తున్నాడని ఆరోపిస్తున్నారు. ప్రభుత్వం వెంటనే కార్మిక సంఘం నేతలతో చర్చలు జరిపి, కార్మికుల సమస్యలు పరిష్కరించడానికి కృషి చేయాలని కోరుతున్నారు.