(న్యూస్ ఆర్బిట్ డెస్క్)
కాంగ్రెస్ పార్టీ కంచుకోటలో గులాబీ జెండా ఎగిరింది. హుజూర్నగర్లో తొలిసారిగా టీఆర్ఎస్ పార్టీ విజయం సాధించింది. ఈ ఉపఎన్నికలో టీఆర్ఎస్ అభ్యర్థి శానంపూడి సైదిరెడ్డి రికార్డు మెజార్టీతో గెలుపొందారు. కాంగ్రెస్ అభ్యర్థి పద్మావతిపై 43,284ఓట్ల మెజార్టీ సాధించారు. 15వ రౌండ్ ముగిసేసరికే 2009 నాటి ఉత్తమ్ రికార్డును సైదిరెడ్డి బ్రేక్ చేశారు. ఏ రౌండ్ లోనూ టీఆర్ఎస్ కు కాంగ్రెస్ పోటీ ఇవ్వలేకపోయింది. సైదిరెడ్డి సాధించిన మెజార్టీ ఇంతవరకూ హుజూర్నగర్ చరిత్రలోనే ఎవ్వరూ సాధించలేదు. ఇప్పటి వరకూ హుజూర్నగర్లో 29,194ఓట్లు మెజార్టీ ఉంది. అయితే సైదిరెడ్డి ఏకంగా43,284ఓట్ల మెజార్టీ సాధించడం విశేషం. ఇక బీజేపీ, టీడీపీ అభ్యర్థుల డిపాజిట్లు గల్లంతయ్యాయి. దీంతో హుజూర్నగర్లో గులాబీ జెండా ఎగరాలనే టీఆర్ఎస్ శ్రేణుల కల నెరవేరింది. ఓట్ల వారీగా చూస్తే.. టీఆర్ఎస్కు 1,12,796, కాంగ్రెస్కు 69,563, బీజేపీకి 2621, టీడీపీకి 1827, స్వతంత్ర అభ్యర్థి హెల్మెట్ గుర్తు సుమన్కు 2693ఓట్లు పోలయ్యాయి.
హుజూర్నగర్ అంటేనే కాంగ్రెస్ కంచుకోటగా పేరుంది. టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డికి పెట్టని కోట. అయినా..అక్కడ గెలవాలని టీఆర్ఎస్ చేయని ప్రయత్నం లేదు. గత ఎన్నికల్లో కోదాడలో గెలిచిన టీఆర్ఎస్..హుజూర్నగర్ను మాత్రం కోల్పోయింది. సైదిరెడ్డిపై ఏడు వేల ఓట్ల తేడాతో ఉత్తమ్ గెలిపొందారు. అయితే..లోక్సభ ఎన్నికల్లో ఉత్తమ్ కుమార్ రెడ్డి నల్లగొండ నుంచి ఎంపీగా ఎన్నికవ్వడంతో హుజూర్నగర్ సీటు ఖాళీ అయింది. ఈ ఉపఎన్నికను ఇటు కాంగ్రెస్, అటు టీఆర్ఎస్ ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. గత ఎన్నికల్లో కాంగ్రెస్ వైపు మొగ్గు చూపిన ఓటర్లు, ఈ దఫా టీఆర్ఎస్ వైపు నిలవడం గమనార్హం.
సైదిరెడ్డి రెండు సార్లు ఓడిపోయి ఉండటంతో సానుభూతి ఉంటుందని టీఆర్ఎస్ లెక్కలు వేసుకుకుంది. అంతేకాదు..టీఆర్ఎస్ ను గెలిపిస్తే..భారీ ఎత్తున అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతామని టీఆర్ఎస్ ప్రచారంలో వాగ్దానం చేసింది. దీంతో కాంగ్రెస్ కంచుకోట బద్దలైంది. ఆర్టీసీ సమ్మె ప్రభావం, ప్రభుత్వం మీద వ్యతిరేక ఉంది తమకు కలిసి వస్తుందని భావించిన కాంగ్రెస్కు చేదు వార్త మిగిల్చింది హుజూర్ నగర్. ఆర్టీసీ కార్మికుల సమ్మె వేళ.. హుజూర్ నగర్ ఉపఎన్నిక గెలుపు టీఆర్ఎస్ ప్రభుత్వానికి పెద్ద బూస్టేనని చెప్పాలి. ఈ ఎన్నికతో తెలంగాణలో ఇక కాంగ్రెస్ పని అయిపోయిందంటూ టీఆర్ఎస్ విమర్శలు మొదలు పెట్టింది. గ్రూపు గొడవలే మరోసారి కాంగ్రెస్ను దెబ్బతీశాయని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. ముఖ్యంగా ఆర్టీసీ సమ్మె, టీఆర్ఎస్ సర్కార్పై విమర్శలను సొమ్ము చేసుకోవడంలో కాంగ్రెస్ విఫలమయ్యామని కొందరు సొంత పార్టీ నేతలే చెప్పుకుంటున్నారట. టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ సిట్టింగ్ స్థానాన్నే చేజార్చుకోవడంపై కాంగ్రెస్లో అంతర్మథనం మొదలైందని గుసగుసలు వినిపిస్తున్నాయి. మరి ఈ పరిస్థితుల్లో కాంగ్రెస్ నేతలు ఎలా స్పందిస్తారో చూడాలి.