న్యూఢిల్లీ: గట్టి పలుకుబడి ఉన్న వ్యక్తులు తనను లైంగికంగా దోపిడీ చేస్తున్నారంటూ సోషల్ మీడియాలో ఒక వీడియో పోస్టు చేసిన యువతి ఆ తర్వాత కనబడకుండా పోవడం ఉత్తరప్రదేశ్లో అలజడి సృష్టించింది. ఆమె తన వీడియోలో ప్రత్యేకంగా ఎవరి పేర్లూ ప్రస్తావించకపోయినా ఆమె తండ్రి మాజీ కేంద్ర మంత్రి స్వామీ చిన్మయానందపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ వార్త రాసే సమయానికి ఆ ఫిర్యాదుపై పోలీసులు కేసు నమోదు చేయలేదు.
షాజహాన్పూర్లోని సుఖదేవానంద్ పోస్టుగ్రాడ్యుయేషన్ కాలేజిలో ఆ యువతి న్యాయశాస్త్రం చదువుతోంది. స్వామీ చిన్మయనంద ఆ కాలేజి నిర్వహణ కమిటీ అధ్యక్షుడు. ముఖ్యమంత్రి ఆదిత్యనాధ్, ప్రధాని నరేంద్ర మోదీ తనను ఆదుకోవాలని ఆ యువతి వీడియోలో కోరింది. వీడియో మూడు రోజులుగా సోషల్ మీడియాలో వైరల్ అయింది. మూడు సార్లు ఎంపీగా గెలిచిన చిన్మయనంద ఒకసారి కేంద్రంలో హోశాఖ సహాయ మంత్రిగా పని చేశారు.
సంత్ సమాజ్ పెద్ద నాయకుడు ఒకరు మరి కొందరు యువతుల జీవితాలను కూడా నాశనం చేశాడు. అతను నన్ను చంపుతానని బెదిరిస్తున్నాడు. అతనికి సంబంధించి నా దగ్గర ఆధారాలు ఉన్నాయి. ముఖ్యమంత్రి ఆదిత్యనాధ్, ప్రధాని నరేంద్ర మోదీ నన్ను ఆదుకోవాలి. పోలీసులు, జిల్లా మెజిస్ట్రేట్ తన జేబులో ఉన్నారని ఆ సన్యాసి చెబుతుంటాడు. నేను ఎలా జీవిస్తున్నానో నాకే తెలుసు అని ఆ యువతి వీడియోలో చెబుతుంటుంది. ఆగస్టు 24న ఈ వీడియోను ఆమె తన ఫేస్బుక్ పేజిలో పోస్టు చేసింది. వీడియోను కదిలే కారులో తీసినట్లుంది.
యువతి తండ్రి స్వామీ చిన్మయనందపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. తాను చిన్మయానందతో మాట్లాడేందుకు విఫలయత్నం చేశానని ఆయన మీడియాతో అన్నారు. చిన్మయానంద న్యాయవాది ఆ ఆరోపణలను ఖండించారు. ఇది చిన్మయానంద నుంచి డబ్బు గుంజే ప్రయత్నమని ఆయన అన్నారు. అయిదు కోట్ల రూపాయలు డిమాండ్ చేస్తూ ఒక వాట్సాప్ మెసేజ్ వచ్చిందని పేర్కొంటూ ఆ న్యాయవాది విడిగా పోలీసులకు ఫిర్యాదు చేశారు.
గత సంవత్సరం చిన్మయానందపై ఉన్న ఒక రేప్ కేసును రద్దు చేసేందుకు ఆదిత్యనాధ్ ప్రభుత్వం ప్రయత్నించింది. అయితే కోర్టు అందుకు ఒప్పుకోలేదు. షాజాహాన్పూర్లో చిన్మయానంద నడిపే ఆశ్రమంలో చాలా సంవత్సరాల పాటు ఉన్న ఒక మహిళ ఫిర్యాదుపై ఈ కేసు దాఖలయింది. తనను బయటకు వెళ్లనీయకుండా ఆశ్రమంలో బంధించి కొన్నేళ్ల పాటు పదేపదే అత్యాచారం చేశారని ఆమె ఫిర్యాదు చేసింది. దీనిపై 2012లో పోలీసులు చార్జిషీటు దాఖలు చేశారు. చిన్మయానందను మాత్రం అరెస్టు చేయలేదు.
Video Courtesy: ND TV