(న్యూస్ ఆర్బిట్ బ్యూరో)
అమరావతి: రాజధాని ప్రాంతంలో ఒక రాజ్యసభ సభ్యుడికి భూములు ఉన్నాయన్న మునిసిపల్ శాఖ మంత్రి బొత్సా సత్యనారాయణ మంగళవారం ఒక అడుగు ముందుకు వేసి బిజెపి నేత సుజనా చౌదరి కుటుంబసభ్యుల పేరు మీద ఉన్న భూములు చిట్టా ఇదుగో అంటూ కొంత సమాచారం మీడియా ముందు ఉంచారు. అయితే ఆ వివరాలు బొత్స ఆరోపణలను ఏమాత్రం బలపరచడం లేదు. మొత్తం మీద వ్యవహారం కొండను తవ్వి ఎలుకను పట్టినట్లయింది.
బొత్స బయటపెట్టిన వివరాల ప్రకారమే సుజనా చౌదరి బంధువుల భూములు రాజధానికి దాదాపు వంద కిలోమీటర్ల దూరంలో ఉన్న చందర్లపాడు, వీరులపాడు మండలాలలో ఉన్నాయి. సుజనా చౌదరి అల్లుడు జితిన్ కుమార్ డైరెక్టర్గా ఉన్న కళింగ గ్రీన్టెక్ కంపెనీకి చందర్లపాడు మండలం గుడిమెట్లలో 110ఎకరాల భూమి ఉందనీ, సోదరుడి కుమార్తె యలమంచిలి రుషి కన్య పేరు మీద వీరులపాడు మండలం గోకరాజుపల్లిలో 14ఎకరాలు ఉన్నాయని ఆయన తెలిపారు.
బొత్స మీడియా సమావేశం తర్వాత సుజనా చౌదరి ఎబిఎన్ ఆంధ్రజ్యోతి ఛానల్తో మాట్లాడుతూ, బొత్స బయటపెట్టిన వివరాలను అపహాస్యం చేశారు. రాజధాని భూములకూ, మంత్రి బయటపెట్టిన వివరాలకూ ఏమైనా సంబంధం ఉందా అని ఆయన ప్రశ్నించారు. తనకు కానీ, తన కుటుంబసభ్యులకు కానీ ఉన్న భూములు ఎప్పుడు కొన్నదీ, ఎవరి దగ్గర కొన్నదీ వివరాలు బయటపెట్టాలని ఆయన సవాలు చేశారు. ప్రభుత్వం వారిదే కదా, వివరాలు సంపాదించడం ఎంత పని అని ఆయన అన్నారు.
రాజధాని అమరావతి ముంపు ప్రాంతంలో ఉందని చెప్పి రైతుల్లో తీవ్రమైన అలజడి సృష్టించిన బొత్స, భూముల సేకరణకు ముందు ఇన్సైడ్ ట్రేడింగ్ జరిగిందని కూడా ఆరోపించారు. ఒక రాజ్యసభ సభ్యుడికి చాలా భూములు ఉన్నాయనీ, ఆయనే అడిగితే వివరాలు వెల్లడిస్తామనీ బొత్స నిన్న అన్నారు. రాజాధాని ప్రాంతంలో తనకు ఒక్క ఎకరా భూమి ఉన్నా చూపించాలని సుజనా సవాలు చేయడంతో బొత్స సత్యనారాయణ ఈరోజు మీడియా సమావేశం నిర్వహించి ఈ వివరాలు బయటపెట్టారు.