అమరావతి: తనపై ఇన్సైడ్ ట్రేడింగ్ ఆరోపణలు నిరూపిస్తే ఆ భూములను ప్రభుత్వానికి రాసిస్తానని ఏపి ఎన్ఆర్టి సొసైటి మాజీ అధ్యక్షుడు వేమూరు రవికుమార్ పేర్కొన్నారు. నారా లోకేష్ సన్నిహితుడు, వ్యాపార భాగస్వామి వేమూరు రవికుమార్ 25.68 ఎకరాలు కొనుగోలు చేసి ఇన్సైడ్ ట్రేడింగ్కు పాల్పడ్డారని నిన్న అసెంబ్లీలో ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాధ్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై వేమూరు రవికుమార్ స్పందిస్తూ బుధవారం పత్రికా ప్రకటన విడుదల చేశారు. మంత్రి చేసిన ఆరోపణలు పూర్తిగా అబద్దాలని స్పష్టం చేశారు.
‘అమరావతి ప్రాంతంలో నేను ఏప్రిల్ 2004,2005 సంవత్సరంలో (అనగా 15 సంవత్సరాల క్రితం) 6.30 ఎకరాలు కొనుగోలు చేశాను. అప్పటి నుండి 2014 సెప్టెంబర్ నాల్గవ తేదీ రాజధాని ప్రకటన వచ్చే వరకూ ఏ భూములు కొనలేదు. రాజధాని ప్రకటన జరిగిన తరువాత 9.86 ఎకరాలు మాత్రమే కొన్నాను. మొత్తం నా కుటుంబానికి ఉన్నది 16.16 ఎకరాలు మాత్రమే. అందులో ఆరు ఎకరాలు రాజధాని పరిధికి వెలుపల ఉన్నది. ఇన్సైడ్ ట్రేడింగ్ ద్వారా రాజధాని ప్రకటనకు ముందు నేను భూములు కొనుగోలు చేశానని నిరూపిస్తే ఆ భూములను ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న ప్రభుత్వానికి అప్పగించడానికి నాకు అభ్యంతరం లేదు’ అని ఆయన పేర్కొన్నారు.
‘ఇది కాక నాకు పది శాతం కంటే తక్కువ భాగస్వామ్యం ఉన్న కంపెనీలు కొనుగోలు చేసిన భూములను కూడా కలిపి ఆర్థిక మంత్రి బుగ్గన గారు మొత్తం 25.68 ఎకరాలు నా పేరుతో ఉన్నట్లు పేర్కొన్నారు. పైగా ఆయా కంపెనీలు కొనుగోలు చేసిన భూములు కూడా రాజధాని ప్రకటన తర్వాత కొనుగోలు చేశారే తప్ప ప్రకటనకు ముందు కాదు’ అని వేమూరు స్పష్టం చేశారు.
విదేశాలలో వృత్తి, వ్యాపారాలతో సంపాదించిన సొమ్ముతోనే ఈ భూములు తాను కొనుగోలు చేశాననీ, తాను మరొకరికి బినామీగా ఉండవలసిన అవసరము లేదని వేమూరు పేర్కొన్నారు. నారా లోకేష్తో వ్యాపార లావాదేవీలు ఉన్నాయని నిరూపిస్తే ఆ వ్యాపారాలను రాష్ట్ర ప్రభుత్వానికి రాసిచ్చేందుకు ఎలాంటి అభ్యంతరం లేదని వేమూరు అన్నారు. ఇప్పటికైనా తప్పుడు ప్రచారాన్ని ఆపవలసిందిగా ఆయన విజ్ఞప్తి చేశారు.