అమరావతి: మూడు రాజధానులు అంటూ సిఎం జగన్ చేసిన ప్రకటనపై కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత తులసిరెడ్డి తనదైన శైలిలో స్పందించారు. ఆయిదేళ్లు ప్రజలకు చంద్రబాబు వైకుంఠం చూపిస్తే మూడు రాజధానుల పేరుతో జగన్ కైలాసం చూపిస్తున్నారని ఆయన విమర్శించారు. నిపుణుల కమిటీ నివేదిక రాకముందే రాజధానిపై జగన్ ప్రకటన ఎందుకు చేశారని తులసిరెడ్డి ప్రశ్నించారు. కమిటీ నివేదిక రాకముందే జగన్ ప్రకటన చేయడం మంచిది కాదన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. కమిటీ నివేదిక వచ్చిన తరువాత అసెంబ్లీ, పార్టీలు, ప్రజా సంఘాలతో చర్చించి నిర్ణయం ప్రకటిస్తే బాగుండేదని అన్నారు.
అమరావతిలోనే సచివాలయం కొనసాగిస్తూ అసెంబ్లీ, శాసనమండలి భవనాలను విశాఖలో పెడితే బాగుంటుందని తులసిరెడ్డి పేర్కొన్నారు. కర్నూలులో హైకోర్టు ఏర్పాటును స్వాగతిస్తున్నామని పేర్కొంటూ అమరావతి, విశాఖలో హైకోర్టు బెంచీలు ఏర్పాటు చేస్తే కక్షిదారులకు ఇబ్బందులు ఉండవని చెప్పారు.
సచివాలయం రాజధానికి గుండెకాయలాంటిదని అన్నారు. ఇప్పటికే కేంద్ర మ్యాప్లో అమరావతి రాజధానిగా చూపిందనీ కావున సచివాలయాన్ని అమరావతిలోనే కొనసాగించాలనీ ఆయన సూచించారు.