అమరావతి: అక్రమ కట్టడమైన ప్రజావేదికను కూల్చివేసిన ప్రభుత్వం చంద్రబాబు ఉంటున్న నివాసానికి సైతం నోటీసు ఇచ్చిన నేపథ్యంలో పలువురు టిడిపి నేతలు చంద్రబాబు నివాసానికి తమ ఇల్లు ఇస్తామంటూ ముందుకు వస్తున్నారు. మాజీ ఎంపి రాయపాటి సాంబశివరావు గుంటూరులోని తన నివాసం ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నానని ప్రకటించగా రాజధాని ప్రాంతంలోని పలువురు పార్టీ అభిమానులు ఇల్లు ఇవ్వడానికి ముందుకు వస్తున్నారు.
ఈ వ్యవహారాలపై వైసిపి ఎంపి విజయసాయిరెడ్డి స్పందిస్తూ నేడు ట్విట్టర్ వేదికగా విమర్శలు గుప్పించారు. ఈ తతంగం అంతా ఒక డ్రామాగా ఉందని ఆయన అభివర్ణించారు.
ఎవరు సలహా ఇచ్చారో కాని తనను ఓదార్చేందుకు రోజుకు 300మందిని చంద్రబాబు రప్పించుకుంటున్నారని విజయసాయిరెడ్డి వ్యాఖ్యానించారు. వచ్చిన వాళ్లు రిహార్సల్ చేసి మరీ నటిస్తున్నారని విజయసాయిరెడ్డి ఎద్దేవా చేశారు. దేశంలోనే సంపన్నుడైన రాజకీయ నేత చంద్రబాబుకు ఇల్లులేకపోతే మా ఇంటికొచ్చి ఉండండయ్యా అనడం డ్రామా కాకపోతే మరేమిటని విజయసాయిరెడ్డి ప్రశ్నించారు.
అదే విధంగా నారా లోకేష్ను ఉద్దేశించి ట్వీట్ చేస్తూ ప్రజావేదిక అనే రేకుల షెడ్డును హెరిటేజ్ కంపెనీ డబ్బులతో ఏమైనా కట్టారా అని విజయసాయిరెడ్డి ప్రశ్నించారు. ‘మీరు, ముఠా సభ్యులు తెగ ఆవేశపడుతున్నారు. 50లక్షల రూపాయలు విలువ చేయని తాత్కాలిక నిర్మాణానికి తొమ్మిది కోట్ల రూపాయలు దోచుకుతిన్నది బయటపడిందనా ఏడుపులు? కిరాయి మనుషులతో పరామర్శలు, విషాద ఆలాపనలు ఏమిటని విజయసాయిరెడ్డి దుయ్యబట్టారు.