అమరావతి: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి వంద రోజుల పాలన తీరుపై అధికార విపక్ష పార్టీల నేతల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. ఈ ఏడాది మార్చి 30వ తేదీన ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్మోహనరెడ్డి పదవీ ప్రమాణ స్వీకారం చేశారు. అనాటి నుండి జగన్మోహనరెడ్డి పాలనలో తనదైన ముద్ర కోసం పలు కీలక నిర్ణయాలను తీసుకున్నారు.
వైసిపి ప్రభుత్వ వంద రోజుల పాలన అప్రతిష్టను మూటకట్టుకుందనీ, ఇది విధ్వంసకర ప్రభుత్వమనీ టిడిపి అధినేత చంద్రబాబు విమర్శిస్తున్నారు. టిడిపి కార్యకర్తలపై దాడులు చేస్తూ పులివెందుల పంచాయతీని రాష్ట్రం మొత్తం రుద్దాలని చూస్తున్నారని చంద్రబాబు ఆరోపించారు. ఆంధ్రుల రాజధాని అమరావతి బ్రాండ్ను చంపాలని చూస్తున్నారనీ, ఏపి జీవనాడి పోలవరం ప్రాజెక్టును అటకెక్కించారనీ చంద్రబాబు ఆరోపిస్తున్నారు.వంద రోజుల పాలనలోనే ఇంత చెడ్డపేరు తెచ్చుకున్న ముఖ్యమంత్రి చరిత్రలో మరొకరు లేరని చంద్రబాబు వ్యాఖ్యానించారు.
నూతన ప్రభుత్వానికి ఆరు నెలల సమయం ఇస్తామనీ ఆ తరువాతే ప్రజా సమస్యలపై స్పందిస్తామనీ గతంలో టిడిపి అధినేత చంద్రబాబు, బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ, జనసేన అధినేత పవన్ కళ్యాణ్లు పేర్కొన్న విషయం తెలిసిందే. అయితే రాజధాని అమరావతిపై బొత్సా వ్యాఖ్యలతో రాజధాని ప్రాంత రైతుల్లో నెలకొన్న అయోమయం, ఆందోళన, రాష్ట్రంలో ఇసుక కొరతతో భవన నిర్మాణ కార్మికుల ఇబ్బందులు తదితర విషయాలపై విపక్ష పార్టీల నేతలు ఆరు నెలలు గడవక ముందే ప్రభుత్వ చర్యలను ఖండిస్తూ రోడ్డుపైకి ఎక్కారు.
టిడిఎల్పి ఉప నేత కింజరపు అచ్చెన్నాయుడు, ఆ పార్టీ నాయకుడు యనమల రామకృష్ణుడు, కళా వెంకట్రావు తదితర నాయకులు జగన్ వంద రోజుల పాలన తీరుపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తుతున్నారు. విధ్వంసాలు, దాడులు, రద్దులు తప్ప ఈ వంద రోజుల్లో ఏమి చేశారని ప్రశ్నిస్తున్నారు. అన్న క్యాంటిన్ రద్దు, పోలవరం పనులు రద్దు, అమరావతి పనులు నిలిపివేత, పిపిఎల రద్దు ఇలా నూరు రోజుల్లో మూడు వందల తప్పులు, ఆరువందల రద్దులతో ప్రభుత్వం నడిచిందని టిడిపి నేత కళా వెంకట్రావు విమర్శించారు. 24 గంటలు నిరంతరాయంగా ఉచిత విద్యుత్ ఉన్న పరిస్థితుల్లో పిపిఎలపై సమీక్షలు చేసి కరెంటు ఇబ్బందులు తీసుకువచ్చారని అచ్చెన్నాయుడు ఆరోపించారు. రద్దులు, రివర్స్లు, పథకాలను అపహాస్యం చేయడమే జగన్ ప్రభుత్వం నిర్వాకం తప్ప మరోటి కాదని అచ్చెన్నాయుడు వ్యాఖ్యానించారు. టిడిపి ప్రభుత్వ అవినీతి వెతకడం కోసం వంద రోజులు కష్టపడి ఏమీ దొరకక చతికిలపడ్డారని అచ్చెన్నాయుడు అన్నారు.
రాష్ట్రంలో తుగ్లక్ పాలన సాగుతోందని నారా లోకేష్ విమర్శించారు. అమరావతిని ఎడారి చేశారు, పోలవరాన్ని మంగళవారంగా మార్చేశారని లోకేష్ విమర్శించారు. ప్రజలకు, కార్మికులకు పని, తిండి లేకుండా చేసి ఈకెవైసి అంటూ క్యూలో నిలబెడుతున్నారని లోకేష్ విమర్శించారు.
వీరు ఇలా ఆరోపణలు చేస్తుండగా జగన్మోహనరెడ్డి వంద రోజుల పాలనలో ఆమోఘమైన పథకాలను ప్రవేశపెట్టి అమలు చేస్తున్నారని వైసిపీ నేతలు పేర్కొంటున్నారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు నవరత్న పథకాలను వైసిపి అమలు చేస్తోందని చెబుతున్నారు. ఆ పార్టీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు మాట్లాడుతూ గ్రామ సచివాలయ వ్యవస్థ తీసుకురావడంతో పాటు వంద రోజుల్లో నాలుగు లక్షల ఉద్యోగాలు భర్తీ చేసిన ఘనత ముఖ్యమంత్రి జగన్మోహనరెడ్డికే దక్కుతుందని అన్నారు. వంద రోజుల పాలనలో కీలకమైన నిర్ణయాలు తీసుకున్నారని అంబటి పేర్కొన్నారు. భారతదేశ చరిత్రలో పిన్న వయస్సులో సిఎం అయిన వారిలో వైఎస్ జగన్ ఒకరని అంబటి అన్నారు. రాజకీయ అవినీతి రూపు మాపాలని జగన్ దృఢ సంకల్పంతో పాలన చేస్తున్నారని అంబటి పేర్కొన్నారు. జగన్ పాలనను చూసి ఓర్వేలేక చంద్రబాబు బురద జల్లుతున్నారని అంబటి విమర్శించారు. ఆరు నెలల వరకూ విమర్శలు చేయనని చెప్పిన చంద్రబాబు మూడు నెలలకే విమర్శలు మొదలు పెట్టారని అంబటి అన్నారు.
మంత్రి మోపిదేవి వెంకట రమణ మాట్లాడుతూ ఎన్నికల హామీలను నెరవేరుస్తూ ప్రజా సంక్షేమమే ధ్యేయంగా వైసిపి ప్రభుత్వం అడుగులు వేస్తున్నదని చెప్పారు. ఆర్టిసి విలీనంతో జగన్ చరిత్ర సృష్టించారని వెంకట రమణ అన్నారు. గత అసెంబ్లీ సమావేశాల్లో ప్రజలకు మేలు చేసే 19 కీలక బిల్లులను ప్రవేశపెట్టి ఆమోదించామని వెంకట రమణ తెలిపారు. మరో మంత్రి బొత్సా సత్యనారాయణ మాట్లాడుతూ ఐదేళ్లలో చంద్రబాబు చేయలేని పనులను సిఎం జగన్ వంద రోజుల్లో చేసి చూపించారని అన్నారు.