న్యూఢిల్లీ: ఆంద్రప్రదేశ్ కాబోయే ముఖ్యమంత్రి, వైసిపి నేత వైఎస్ జగన్మోహనరెడ్డి ఆదివారం ప్రధాన మంత్రి నరేంద్ర మోదిని కలిసి 30వ తేదీన విజయవాడలో జరిగే తన ప్రమాణ స్వీకారోత్సవానికి ఆహ్వానించారు.
ప్రత్యేక విమానంలో న్యూఢిల్లీ చేరుకున్న వైఎస్ జగన్ పార్లమెంట్ సభ్యులతో కలిసి మోదీ నివాసానికి వెళ్లారు. ఈ సందర్భంగా మోదీ జగన్ను ఆప్యాయంగా స్వాగతించి ఆలింగనం చేసుకున్నారు. మోదికి జగన్ పుష్పగుచ్చం అందజేసి శాలువాతో సత్కరించి రెండవ పర్యాయం ప్రధాన మంత్రిగా బాధ్యతలు స్వీకరిస్తున్న సందర్భంగా అభినందనలు తెలియజేశారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వి సుబ్రమణ్యంతో కలిసి ప్రమాణ స్వీకార అహ్వానాన్ని మోదికి అందజేశారు. అనంతరం దాదాపు గంటకు పైగా జరిగిన భేటీలో రాష్ట్రంలోని పరిస్థితులు, కేంద్రం నుండి అందాల్సిన సాయం వంటి అంశాలను జగన్ ప్రధాని మోది దృష్టికి తీసుకువచ్చిన్నట్లు సమాచారం.
విభజన హామీలను నెరవేర్చాలనీ, ఆర్థికంగా వెనుకబడిన ఆంధ్రప్రదేశ్కు సహాయం చేయాలని మోదిని కోరారు. ఎపికి రావాల్సిన పెండింగ్ నిధులు 30వేల కోట్లతో పాటు మరో 30వేల కోట్ల రూపాయల నిధులు విడుదల చేయాలనీ, ప్రత్యేక హోదాపై నిర్ణయం తీసుకోవాలని జగన్ విజ్ఞప్తి చేశారు.
కడప స్టీల్ ప్లాంట్, పోలవరం, దుగరాజపట్నం పోర్టు వంటి భారీ ప్రాజెక్టులకు అదనపు నిధులు కేటాయించాలని మోదిని కోరారు. రాష్ట్ర అభివృద్ధికి కేంద్రం సంపూర్ణ సహకారం అందించాలని వినతి పత్రం అందజేశారు.
ఈ సందర్భంలోనే ఎన్నికల్లో ఘన విజయం సాధించిన వైఎస్ జగన్ను మోది అభినందించారు.
మోదిని కలిసిన జగన్ బృందంలో పార్లమెంట్ సభ్యుడు విజయసాయిరెడ్డి, వేమిరెడ్డి ప్రభాకరరెడ్డి, అవినాష్ రెడ్డి, మిథున్ రెడ్డి, మార్గాని భరత్, నందిగం సురేష్లు ఉన్నారు.
.