గుంటూరు: విద్యార్థి సంఘం నాయకులపై వైసీపీ ఎమ్మెల్యే వ్యవహరించిన తీరు వివాదాస్పదంగా మారింది. నరసరావుపేట రెడ్డి కాలేజీలో అధిక ఫీజులపై విద్యార్థుల ఆందోళన చేపట్టారు. విద్యార్థులకు ఎస్ఎఫ్ఐ నేతలు మద్దతుగా నిలిచారు. అయితే ఈ విషయం తెలుసుకున్న గురజాల వైసీపీ ఎమ్మెల్యే కాసు మహేష్రెడ్డి సదరు కాలేజీకి చేరుకుని ఎస్ఎఫ్ఐ నేతలపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
‘నా క్యాంపస్లోకి ఎందుకొచ్చారు..?. ఎస్ఎఫ్ఐ అయితే ఎవడికి గొప్ప?.. మీరు పది మందితో వస్తే నేను వందమందితో వస్తా. ప్రైవేటు కాలేజీలో మీకు ఏంటి పని? కాలేజీలో సమస్యలు ఉంటే నా అపాయింట్ మెంట్ తీసుకుని రా. అప్పుడు మాట్లాడదాం. అపాయింట్ మెంట్ లేకుండా నా క్యాంపస్ లోకి వస్తే పోలీసులతో కేసు పెట్టిస్తా. ఇదే లాస్ట్ వార్నింగ్ నా క్యాంపస్లోకి రావొద్దు’ అంటూ కాసు మహేష్ మండిపడ్డారు.
‘ఇష్టమైతే కాలేజీలో ఉండండి లేకపోతే వేరే కాలేజీకి వెళ్లండి. మీకు సేవలు చేయాల్సిన అవసరం నాకు లేదు. మీరే కాలేజీ నుంచి వెళ్లిపోయినా పర్వాలేదు. డబ్బులు ఉంటే కట్టండి లేకపొతే పొండి. మీరు ఫీజులు కట్టకపోతే టీచర్లకు జీతాలు ఎలా ఇవ్వాలి ?’ అని కాలేజీ విద్యార్థులను ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి ప్రశ్నించారు. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది.