(న్యూస్ ఆర్బిట్ బ్యూరో)
అమరావతి: రాజధాని తరలింపు వ్యవహారం సచివాలయ ఉద్యోగుల్లోనూ తీవ్ర కలకలాన్ని రేపుతోంది. సిఎం జగన్ మూడు రాజధానుల ప్రకటన చేసినప్పటి నుండి అమరావతి ప్రాంతంలోని రైతులు తీవ్ర ఆందోళన చెందుతున్న విషయం తెలిసిందే. అమరావతిలోనే రాజధాని కొనసాగించాలని డిమాండ్ చేస్తూ రైతులు వారి కుటుంబ సభ్యులు పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలను నిర్వహిస్తుండగా వందలాది మంది సచివాలయ ఉద్యోగులు కూడా మానసికంగా ఆందోళన చెందుతున్నారు. అమరావతి రైతులకంటే తమ పరిస్థితి మరింత దారుణంగా ఉందని పలువురు సచివాలయ ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
సిఎం మూడు రాజదానుల ప్రకటనకు తగిన విధంగానే జిఎన్ రావు కమిటీ నివేదిక, బోస్టర్ రిపోర్టులు రావడంతో విశాఖపట్నానికి సచివాలయం తరలింపు లాంఛనమే అని తేలిపోతున్నది. ఈ రెండు కమిటీల నివేదికలను అధ్యయనం చేసేందుకు ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాధ్ రెడ్డి నేతృత్వంలో పలువురు మంత్రులు, ఉన్నతాధికారులతో హైపవర్ కమిటీని ప్రభుత్వం ఏర్పాటు చేసింది. అయితే ఈ కమిటీ కూడా జగన్మోహనరెడ్డి ఆలోచనకు తగిన విధంగానే నివేదిక ఇచ్చే అవకాశాలు ఉన్నందున పలువురు ఉన్నతాధికారులు విశాఖలో పరిపాలనా భవనాలను ఎక్కడెక్కడ ఏర్పాటు చేయాలనే విషయంపై ఇప్పటి నుండి పరిశీలన కూడా ప్రారంభించారు. హైపవర్ కమిటీ నివేదిక అందిన వెంటనే మంత్రివర్గంలో దాన్ని ఆమోదించి ఆ వెంటనే అసెంబ్లీలో తీర్మానాన్ని ప్రవేశపెట్టి ఆమోదించే అవకాశాలు ఉన్నాయి.
రాజధాని తరలింపుపై ప్రసారమాధ్యమాల్లో వస్తున్న వార్తలు సచివాలయ ఉద్యోగులను కలవరపరుస్తున్నాయి. ఏపి సెక్రటేరియట్ అసోసియేషన్ అధ్యక్షుడు వెంకట్రామిరెడ్డి వద్ద పలువురు ఉద్యోగులు తమ ఇబ్బందులను వివరించారు. రాజధాని తరలింపు అంశానికి సంబంధించి అసలేమి జరుగుతుందో తెలియజేయాలని వారు కోరగా ప్రభుత్వం నుండి ఎలాంటి సమాచారం లేదని వెంకట్రామిరెడ్డి తెలిపారు.
‘అమరావతే రాజధాని అనుకొని ఊళ్లల్లో పొలాలు, ఇళ్లు అమ్మేసి రుణాలు తీసుకుని ప్లాట్లు కొనుగోలు చేసుకున్నాం, ఇప్పుడు వాటిని అద్దెకు ఎవరు తీసుకుంటారు ? నెలనెల వాయిదాలు ఎలా కట్టాలి? విశాఖ వెళ్లి అద్దెకు తీసుకోవాలంటే ఎంత చెల్లించాలి? అంత భరించగలమా? పిల్లల చదువులు ఎలా?’ అని పలువురు ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ‘ఇప్పుడు విశాఖపట్నం అంటున్నారు. రాజధాని అక్కడే ఉంచేస్తారా? మళ్లీ అయిదేళ్ల తరువాత అమరావతి రావాలా? ఇంకోకాయన వచ్చి కర్నూలు అంటారు, మేం పోవాలా? రైతులైతే రోడ్డు మీద కూర్చుంటారు. మేము బయటకు వచ్చి గట్టిగా మాట్లాడలేం, లోలోపల ఏడుస్తున్నామనీ అంటున్నారు. ఇప్పటికిప్పుడు విశాఖ వెళ్లమంటే తాము వెళ్లే పరిస్థితిలో లేమని స్పష్టం చేస్తున్నారు. ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటే ఎలాగూ వెళ్లాల్సి ఉంటుంది కాబట్టి విద్యాసంవత్సరం పూర్తి అయ్యే వరకూ సమయం కోరతామని పలువురు ఉద్యోగులు అంటున్నారు.
రాజధాని తరలింపు పై ఉద్యోగులు ఆందోళన… pic.twitter.com/lRLmskunI6
— Mahendra Babu Gaddam ? (@tdpgaddam) January 7, 2020