విజయవాడ: స్వార్థ ప్రయోజనాల కోసమే సీఎం జగన్ ఏపీ రాజధానిని తరలించేందుకు సిద్ధమవుతున్నారని జనసేన నేత నాదెండ్ల మనోహర్ ఆరోపించారు. బుధవారం అమరావతి రైతులకు మద్దతుగా జనసేన నేత పోతిన మహేష్ ఒక్కరోజు దీక్ష చేపట్టారు. దీనికి సంఘీభావం తెలిపిన పార్టీ సీనియర్ నేత నాదెండ్ల.. ప్రభుత్వ తీరుపై తీవ్రంగా మండిపడ్డారు. ముఖ్యమంత్రి జగన్ అధికారమదంతో వ్యవహరిస్తున్నారని అన్నారు. ప్రభుత్వం మారినంత మాత్రాన రాజధానిని మార్చేస్తారా ? అని ప్రశ్నించారు. రాజధాని రైతులతో చర్చించకుండా ఏకపక్షంగా రాజధానిని ఎలా మారుస్తారని నిలదీశారు. అసెంబ్లీ సాక్షిగా అమరావతిని రాజధానిగా అంగీకరించిన జగన్… అధికారంలోకి రాగానే మాట తప్పారని విమర్శించారు. ఒక ప్రాంత ప్రజల పొట్టకొట్టి… మరో ప్రాంత ప్రజల కడుపు నింపుతారా? అని నాదెండ్ల మనోహర్ మండిపడ్డారు. జగన్ ది విభజించు, పాలించు అనే దురాలోచన అని విమర్శించారు. ఏడు నెలల పాలనలో రంగులు వేసుకోవడం తప్ప జగన్ చేసిందేమీ లేదని దుయ్యబట్టారు.
జనసేన నేత జనసేన నేత పోతిన మహేష్ మాట్లాడుతూ భూములిచ్చిన రైతుల్ని క్రిమినల్స్లా చూస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అభివృద్ధి వికేంద్రీకరణ వెనుక జగన్, విజయసాయి స్వార్ధం ఉందని ఆరోపించారు. నివేదికలు రాకముందే ప్రకటనలు చేయడం జగన్ మాయ అని విమర్శించారు. అమరావతి ముంపులో ఉందంటున్న ప్రభుత్వం… హుద్హుద్ తుఫాన్ తో నష్టపోయిన విశాఖ గురించి ఎందుకు చెప్పడం లేదని ? ప్రశ్నించారు.