అమరావతి: టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు మరోసారి పులివెందుల పంచాయతీ అని అంటే ప్రజలు అట్లకాడ కాల్చి మూతిపై వాత పెడతారని వైసీపీ ఎమ్మెల్యే అంబటి రాంబాబు అన్నారు. నెల్లూరు వైసీపీ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ఎంపీడీఓ సరళ మీద దాడి వ్యవహరంలో సీఎం జగన్ పులివెందుల పంచాయతీలు చేస్తున్నారంటూ చంద్రబాబు చేసిన వ్యాఖ్యలకు అంబటి రాంబాబు కౌంటర్ ఇచ్చారు. ఐదేళ్లపాటు అనేక విషయాల్లో పంచాయతీలు చేసి.. ఇప్పుడు తమ పార్టీపై అసత్య ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. కృష్ణా జిల్లాకు చెందిన ఎమ్మార్వో వనజాక్షి, చింతమనేని కేసు, ఐపీఎస్ అధికారికి ఎంపీ కేశినేనికి మధ్య పంచాయతీలు నడిపింది చంద్రబాబు కాదా? అని ప్రశ్నించారు.
‘చంద్రబాబు వింతధోరణితో వ్యవహరిస్తున్నారు. పంచాయితీలు చేసింది మీరు కాదా? వనజాక్షి విషయంలో పంచాయితీ చేసింది ఎవరు? ఐపిఎస్ అధికారి బాలసుబ్రమణ్యంపై కేశినేని నాని దౌర్జన్యం చేస్తే పంచాయితీ చేసింది మీరు కాదా? గత ఐదేళ్లలో పంచాయితీలు చేసిందే మీరు. పంచాయితీలతోనే చంద్రబాబు పైకి వచ్చారు. నేతల మధ్య పంచాయితీలు చేసి రాజీకుదిర్చారు. గత కొద్ది రోజులుగా చంద్రబాబు మాట్లాడితే పులివెందుల పంచాయితీ అని అంటున్నారు. పులివెందుల పౌరుషానికి ప్రతీక. మరోసారి పులివెందుల పంచాయితీ అని అంటే గనుక అట్లాకాడ కాల్చి మూతిపై వాతలు పెట్టాలి’ అని అంబటి రాంబాబు వ్యాఖ్యానించారు.
చంద్రబాబు మానసిక పరిస్థితి సరిగ్గా లేదని, రాష్ట్రంలో ప్రజలకు మంచి పాలన అందిస్తున్న వైసీపీ ప్రభుత్వాన్ని విమర్శించడమే ఆయన పనిగా పెట్టుకున్నారన్నారు. కరకట్ట మీద అక్రమ కట్టడంలో నివసిస్తూ చంద్రబాబు పంచాయతీలు పెడుతున్నారని మండిపడ్డారు. సీఎం జగన్ ప్రారంభించిన కంటివెలుగు పథకాన్ని.. చంద్రబాబు ఎప్పుడో చేశామంటూ అసత్య ప్రచారానికి తెరతీస్తున్నారని ధ్వజమెత్తారు. టీడీపీ విధానాలు నచ్చకపోవడంతోనే ప్రజలు ఆపార్టీని మూలన కూర్చోబెట్టారని అంబటి రాంబాబు విమర్శించారు.