అమరావతి: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి నివాసం, పరిసర ప్రాంతాల్లో సదుపాయాల కల్పనకు గత అయిదు నెలల్లో రాష్ట్ర ప్రభుత్వం 15 కోట్ల63 లక్షల రూపాయలు మంజూరు చేయడం వివాదాస్పదం అవుతోంది. గతంలో చంద్రబాబు నివాసం వద్ద పెద్ద ఎత్తున ప్రభుత్వ నిధులు ఖర్చు చేశారంటూ పలువురు వైసిపి నేతలు తీవ్ర స్థాయిలో విమర్శించారు. ఇప్పుడు తాడేపల్లిలోని సిఎం నివాసానికి కిటికీలు, తలుపుల కోసం తాజాగా 73 లక్షలు విడుదల చేస్తూ జీవో రావడంతో వివాదం మొదలయ్యింది. జగన్ నివాసం వద్ద మౌళిక వసతులు, భద్రతా వ్యవస్థలు సమకూర్చేందుకు, ఇతర ఏర్పాట్ల నిమిత్తం అయిదు నెలల కాలంలో ప్రభుత్వం ఎనిమిది జివోలు విడుదల చేసి ఈ మేరకు నిధులు మంజూరు చేసింది. సంబంధిత ఉత్తర్వులు అన్నీ రహదారులు, భవనాల శాఖ జారీ చేసింది. 15 కోట్ల 63 లక్షల రూపాయలలో 8 కోట్ల 25లక్షల రూపాయలు రహదారి విస్తరణ, భూసేకరణ కోసం మంజూరు చేసింది. దీనిపై టిడిపి నేతలు విమర్శలు సంధిస్తున్నారు.
జగన్ సొంతింటికి 73 లక్షలు ప్రజాధనాన్ని ఎలా కేటాయించారని టిడిపి ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న ప్రశ్నిస్తున్నారు. నిర్మాణం పూర్తి అయిన ఇంటికి డబ్బులు తీసుకోవడమే నిజాయితీనా అని ఆయన విమర్శించారు. ఇదేనా జగన్ రూపాయి తీసుకుని పాలన చేయడం అంటే బుద్దా ప్రశ్నించారు. దీనిపై టిడిపి అధినేత చంద్రబాబు కూడా ట్విట్టర్ వేదికగా స్పందిస్తూ జగన్ను ఘాటుగా విమర్శించారు.
‘రోమ్ నగరం తగలబడుతుంటే నీరో చక్రవర్తి ఫిడేల్ వాయించినట్లు.. గత అయిదు నెలలుగా ఏపి అసలే ఆర్థిక లోటుతో ఉంది, అసలే భవన నిర్మాణ కార్మికులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ఏపి నీరో జగన్ మాత్రం ప్రభుత్వ సొమ్ము 15 కోట్ల 65 లక్షల రూపాయలు ఖర్చు చేసిన రాజభవనంలో కూర్చుని వీడియో గేమ్ ఆడుకుంటున్నారు, షాకింగ్’ అంటూ చంద్రబాబు ట్వీట్ చేశారు.
When Rome burned, Nero fiddled. When AP is burning under financial strain due to 5 months' misrule & construction workers are ending lives, the Nero of AP @ysjagan is busy playing video-games at his palatial home on which a staggering Rs.15.65 Cr was spent by the Govt. Shocking! pic.twitter.com/XeGK2OAZK4
— N Chandrababu Naidu (@ncbn) November 7, 2019