హైదరాబాద్: తెలంగాణ ఆర్టీసీ సమస్య పరిష్కారానికి ముగ్గురు సుప్రీం కోర్టు మాజీ న్యాయమూర్తులతో కమిటీ వేస్తామని హైకోర్టు తెలిపింది. రేపటిలోగా ప్రభుత్వాన్ని అడిగి నిర్ణయం చెప్పాలని అడ్వొకేట్ జనరల్ ను ఆదేశించింది. మంగళవారం ఆర్టీసీ సమ్మె పిటిషన్పై హైకోర్టులో విచారణ జరిగింది. ఈ సందర్భంగా.. గతంలో ఏపీఎస్ ఆర్టీసీ ఉద్యోగులపై ఎస్మా ప్రయోగించారు..ఇప్పుడు టీఎస్ఆర్టీసీపై కూడా ఎస్మా ప్రయోగించేలా ఆదేశాలు ఇవ్వాలని సీనియర్ న్యాయవాది విద్యాసాగర్ హైకోర్టును కోరారు. ఏపీఎస్ ఆర్టీసీపై ప్రయోగించిన ఎస్మా టీఎస్ఆర్టీసీపై ఎలా వర్తిస్తుందని, గతంలో ఇచ్చిన జీవోలు ఇప్పుడు వర్తిస్తాయా అని హైకోర్టు ప్రశ్నించింది. ఆర్టీసీని 1998, 2015లో ఎస్మా కింద పేర్కొంటూ ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చిందని సీనియర్ కౌన్సిల్ విద్యాసాగర్ తెలిపారు. 1998 ఇచ్చింది ఏపీఎస్ ఆర్టీసీకి వర్తిస్తుంది, టీఎస్ఆర్టీసీకి కాదని హైకోర్టు తెలిపింది. 2015లో ఇచ్చిన ఉత్తర్వులు ఆరు నెలల వరకే వర్తిస్తాయని పేర్కొంది.
మరోవైపు బస్సుల్లో అధిక ఛార్జీలు వసూలు చేస్తున్నారని పిటిషనర్ తరపు న్యాయవాది తెలపగా.. దానిపై వినియోగదారుల ఫోరంలో ఫిర్యాదు చేయాలని సూచించింది. అధికఛార్జీల వసూలు కారణంగా సమ్మె చట్ట విరుద్ధమంటూ ప్రకటించలేమని హైకోర్టు అభిప్రాయడింది. సమ్మె లీగలా.. ఇల్లీగలా అనేది నిర్ణయించడం తమ పరిధిలో లేదని పేర్కొంది. ఆర్టీసీ యాజమాన్యం కార్మికులతో చర్చలు జరపాలని ఏ చట్టంలో ఉందని.. ఈ విషయంలో ఏ ప్రాతిపదికన హైకోర్టు ఆదేశించగలదని ప్రశ్నించింది. హైకోర్టు చట్టానికి అతీతం కాదని, చట్టాల పరిధి దాటి వ్యవహరించలేదని ధర్మాసనం అభిప్రాయపడింది. అనంతరం తదుపరి విచారణను రేపటికి వాయిదా వేసింది.