న్యూఢిల్లీ: మహారాష్ట్రలో రాష్ట్రపతి పాలన విధించాలంటూ గవర్నర్ భగత్ సింగ్ కోశ్యారీ సిఫారసు చేసినట్లు వార్తలు వినిపిస్తున్న నేపథ్యంలో శివసేన సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ప్రభుత్వ ఏర్పాటు కోసం మూడు రోజుల సమయం కావాలని అడిగినా గవర్నర్ తక్కువ సమాయాన్ని ఇచ్చారంటూ పిటిషన్ వేసింది. బీజేపీకి 48 గంటల సమయాన్ని గవర్నర్ ఇచ్చారని, తమకు మాత్రం 24 గంటల సమయాన్ని మాత్రమే ఇచ్చారని పేర్కొంది. బీజేపీకి అనుకూలంగా గవర్నర్ వ్యవహారశైలి ఉందని ఆరోపించింది. మరోవైపు శివసేన తరపున కాంగ్రెస్ నేత కపిల్ సిబాల్ సుప్రీంకోర్టులో వాదించనున్నట్టు తెలుస్తోంది.
ప్రస్తుతం మహారాష్ట్ర రాజకీయాలు రసవత్తరంగా మారాయి. ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు ఏ పార్టీకి అనుకూలమైన పరిస్థితులు లేకపోవడంతో రాజకీయ అనిశ్చితి కొనసాగుతోంది. ఈ తరుణంలో, మహారాష్ట్రలో రాష్ట్రపతి పాలనకు గవర్నర్ భగత్ సింగ్ కోష్యారీ సిఫారసు చేసినట్టు వార్తలు వస్తున్నాయి. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలంటూ బీజేపీ, శివసేన, ఎన్సీపీలను గవర్నర్ ఆహ్వానించినప్పటికీ… ఏ పార్టీ కూడా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయలేకపోయింది. ఎన్సీపీకి ఈరోజు రాత్రి 8.30 వరకు గడువు ఉన్నప్పటికీ… ఆ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే పరిస్థితి కనపడకపోవడంతో రాష్ట్రపతి పాలన కోసం కేంద్ర హోంశాఖకు గవర్నర్ భగత్ సింగ్ కోశ్యారీ సిఫారసు చేసినట్లు సమాచారం. గవర్నర్ సిఫారసును కేంద్ర కేబినెట్ ఆమోదించినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. దీంతో మహారాష్ట్రలో రాష్ట్రపతి పాలన అమల్లోకి రానుందని ప్రచారం జరుగుతోంది.
మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో కలిసి పోటీచేసిన బీజేపీ, శివసేన పార్టీలకు సీఎం పీఠం వద్ద పేచీ వచ్చింది. అక్టోబర్ 24న ఎన్నికల ఫలితాలు వెలువడినప్పటి నుంచి ప్రభుత్వ ఏర్పాటుపై ప్రతిష్టంభన కొనసాగుతోంది. మొత్తం 288 స్థానాలు గల మహారాష్ట్ర అసెంబ్లీలో ప్రభుత్వ ఏర్పాటుకు 145 మంది సభ్యుల మద్దతు కావాలి. బీజేపీ 105 స్థానాలు, శివసేన 56, ఎన్సీపీ 54, కాంగ్రెస్ 44 స్థానాల్లో విజయం సాధించాయి. ప్రభుత్వ ఏర్పాటుకు బీజేపీ, శివసేన కూటమికి స్పష్టమైన మెజారిటీ వచ్చింది. అయితే, సీఎం పీఠంపై కన్నేసిన శివసేన.. ఫిఫ్టీ-ఫిఫ్టీ ఫార్ములా ప్రతిపాదించింది. లోక్సభ ఎన్నికల ముందు కుదిరిన ఒప్పంద మేరకు అధికారాన్ని చెరో రెండున్నరేళ్లూ పంచుకోవాలని డిమాండ్ చేసింది. అయితే, దీనికి బీజేపీ అంగీకరించలేదు. దీంతో ఇరు పార్టీల మధ్య మాటల యుద్ధం కొనసాగింది.
మహారాష్ట్రలో నవంబర్ 8న అసెంబ్లీ గడువు ముగిసిపోవడంతో సీఎం ఫడ్నవీస్ రాజీనామా చేశారు. అనంతరం ఆయన ఆపద్ధర్మ సీఎంగా కొనసాగుతున్నారు. తొలుత ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాల్సిందిగా 105 స్థానాలతో అతిపెద్ద పార్టీగా అవతరించిన బీజేపీని గవర్నర్ ఆహ్వానించాగా.. తాము ప్రభుత్వ ఏర్పాటు చేయలేమని ఆపార్టీ గవర్నర్ కు తెలియజేసింది. దీంతో 56 సీట్లతో రెండో అతిపెద్ద పార్టీగా ఉన్న శివసేన గవర్నర్ ఆహ్వానించారు. సోమవారం రాత్రి 7.30 గంటల్లోగా ప్రభుత్వం ఏర్పాటుకు బలాన్ని, సమ్మతిని తెలియజేయాలని సూచించారు. అయితే, ప్రభుత్వ ఏర్పాటుకు శివసేన మరింత గడువు కోరగా.. అందుకు గవర్నర్ తిరస్కరించారు. ఇక 54 స్థానాలతో మూడో అతిపెద్ద పార్టీగా ఉన్న ఎన్సీపీని ప్రభుత్వం ఏర్పాటు చేయాల్సిందిగా గవర్నర్ కోరిన సంగతి తెలిసిందే.