హైదరాబాద్: వెటర్నరీ డాక్టర్ ప్రియాంక రెడ్డి దారుణ హత్య దేశవ్యాప్తంగా ప్రకంపనలు సృష్టిస్తోంది. షాద్నగర్తోపాటు తెలంగాణవ్యాప్తంగా నిరసనజ్వాలలు పెల్లుబుకుతున్నాయి. నిందితులను బహిరంగంగా ఉరి తీయాలని.. బాధితురాలిని చంపిన విధంగానే ఆ రాక్షసులను హింసించి చంపేయాలని మహిళలు, అమ్మాయిలు, ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. ప్రియాంకరెడ్డి హత్య కేసులో నలుగురు నిందితులను పోలీసులు తమ అదుపులోకి తీసుకొని షాద్నగర్ పోలీస్ స్టేషన్లో ఉంచారు. వారికి వైద్య పరీక్షలు నిర్వహించి షాద్నగర్ కోర్టులో హాజరుపరచాల్సి ఉంది. కానీ, నిందితులు పోలీస్ స్టేషన్లో ఉన్న విషయం తెలుసుకొని అక్కడ ప్రజా సంఘాలు, స్థానికులు పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టారు. యువకులు, మహిళలు భారీగా చేరుకున్నారు. నిందితులను బహిరంగంగా ఉరి తీయాలని డిమాండ్ చేస్తున్నారు. వందల సంఖ్యలో వచ్చిన నిరసనకారుల ఆందోళనతో పోలీస్ స్టేషన్ వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది.
నిరసనకారులను చెదరగొట్టేందుకు పోలీసులు లాఠీ ఛార్జి చేయాల్సి వచ్చింది. అయినా వెనక్కి తగ్గని నిరసనకారులు పోలీస్ స్టేషన్ లోకి చొచ్చుకు వెళ్లేందుకు యత్నించారు. దీంతో పీఎస్ గేటుకు పోలీసులు బేడీలు వేశారు. నిందితులను బయటకు తీసుకొచ్చే పరిస్థితి లేకపోవడంతో పోలీస్ స్టేషన్లోనే వారికి వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నారు. షాద్ నగర్ ఏరియా ఆసుపత్రి ఇన్ఛార్జి సూపరింటెండెంట్ శ్రీనివాస్ ఆధ్వర్యంలో ముగ్గురు వైద్యులు నిందితులకి వైద్య పరీక్షలు నిర్వహించారు. నలుగురు నిందితుల ఆరోగ్య పరిస్థితి బాగానే ఉందని వైద్యులు వెల్లడించారు.
ఇదిఇలా ఉంటే.. కోర్టులో జడ్జీలు అందుబాటులో లేకపోవడంతో నిందితులను ఎగ్జిగ్యూటివ్ మెజిస్ట్రేట్ తహశీల్దార్ ఎదుట హాజరుపరిచే అవకాశం ఉంది. నిందితులను విచారణ నిమిత్తం పోలీస్ స్టేషన్ నుంచి బయటకు తీసుకెళ్లడం పోలీసులకు పెద్ద సవాలుగా మారింది. దీనిపై ఉత్కంఠ నెలకొంది.