తెనాలి: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇటీవల తీసుకొచ్చిన ‘దిశ చట్టం’ ఓ బోగస్ అని ఆయేషా తండ్రి ఇక్బాల్ బాష సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రభుత్వాలు ప్రజలకు ఉపయోగపడే చట్టాలు చేయాలి కానీ, రాజకీయ లబ్ధి కోసం కాదని అన్నారు. కేవలం 21 రోజుల్లో శిక్షలు వేయడం సాధ్యం కాదని ఇక్బాల్ బాష అభిప్రాయపడ్డారు. సమగ్రంగా దర్యాప్తు చేస్తే నిందితులను పట్టుకునేందుకు అవకాశం ఉంటుందని అన్నారు. ఆయేషా కేసు విషయంలో సీబీఐ ఎన్ని విచారణలు పూర్తి చేస్తుందో తెలియదన్నారు. తాము ఆరోపించిన నిందితులను ఇప్పటి వరకు సీబీఐ విచారించిందో లేదో తెలియదని కూడా తెలియదని ఇక్బాల్ అన్నారు. అయినప్పటికీ సీబీఐకి సహకరిస్తామని చెప్పారు. ఆయేషా మీరా కేసులో గతంలో జరిగిన విచారణ అంతా బోగస్ అని ఆయన తెలిపారు. ఈ కేసులో అసలైన నిందితులను పట్టుకోవడం ద్వారా సమాజానికి న్యాయం చేయాలని ఇక్బాల్ బాష కోరారు.
ఆయేషా మీరా మృతదేహానికి రీ పోస్టుమార్టంపై ఇక్బాల్ మాట్లాడుతూ.. సీబీఐ అధికారులు ఆయేషా షాంపిల్స్ తీసుకెళ్లారని తెలిపారు. అయితే వారు నమూనాలు సేకరించడం తాను చూడలేదన్నారు. అధికారులు కూడా తనకు ఏమీ చెప్పలేదన్నారు. ఘటన జరిగిన 12 ఏళ్ల తర్వాత నమూనాలు తీసుకుంటే ఎలా ఉపయోగపడుతుందని ఇక్బాల్ ప్రశ్నించారు.