(న్యూస్ ఆర్బిట్ బ్యూరో)
కోల్కతా: ప్రభుత్వ ఆస్థులు ధ్వంసం చేసేవారిని అస్సాం, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల్లో బిజెపి ప్రభుత్వాలు కుక్కల్ని కాల్చినట్లు కాల్చి పారేశాయని బిజెపి నాయకుడు ఒకరు వ్యాఖ్యానించారు. ప్రభుత్వ ఆస్థులను తగలబెట్టడానికి ఆ ఆస్థులు వీళ్ల బాబు సొంతమా అంటూ ఆ నేత చేసిన ప్రసంగం కొత్త వివాదం సృష్టించింది.
పశ్చిమ బెంగాల్ బిజెపి అధ్యక్షుడు దిలీప్ ఘోష్ రాష్ట్రంలోని నాడియా జిల్లాలో ఆదివారం ఒక సభలో ప్రసంగించారు. పౌరసత్వం సవరణ చట్టానికి వ్యతిరేకంగా డిసెంబర్లో ఉద్యమించి ప్రభుత్వ ఆస్థులు ధ్వంసం చేసిన వారిపై మమతా బెనర్జీ ప్రభుత్వం కనీసం లాఠీఛార్జీ కూడా చేయలేదని ఆయన అన్నారు.
ఆస్థులు ధ్వంసం చేశారు. ఎవరి ఆస్థులు ఇవి. రైలు తగలబెట్టారు. అయినా ఒక్క తూటా కూడా పేలలేదు. పోలీసులు కనీసం అరెస్టులన్నా చేయలేదు. అని ఆయన మమత ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. అదే తమ పార్టీ అధికారంలో ఉన్న ఉత్తరప్రదేశ్, అస్సాంలోనయితే ఆందోళనకారులను కుక్కల్ని కాల్చినట్లు కాల్చేశారని ఆయన వ్యాఖ్యానించారు.